మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:51 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టరు రాజకుమారి వైద్యులను ఆదేశిం చారు.

కలెక్టరు రాజకుమారి
పాణ్యం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టరు రాజకుమారి వైద్యులను ఆదేశిం చారు. గురువారం పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, రోగులకు సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించారు. నైట్ డ్యూటీలు రోస్టర్ రిజిస్టర్ ప్రకారం షిఫ్ట్ పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నెలకు ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయి? సాధారణ, సిజేరియన్ల సంఖ్య ఎంత? అని అడిగి తెలుసుకున్నారు. సిజేరియన్ డెలివరీలే ఎందుకు అధికంగా జరుగుతున్నాయని ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిస్టర్లో నలుగురు వైద్యులు ఉండగా ఒక్క అనస్తీషియా వైద్యుడే ఎందుకు విధులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒకరు నైట్ డ్యూటీ చేశారని, మరొకరు ట్రైనింగ్ కు వెళ్లారని వైద్య సిబ్బంది తెలిపారు. రోగులకు వైద్యం అందించాల్సిన సమయంలో ట్రైనింగ్కు ఎందుకు వెళ్లారని ఇందుకు సంజయిషీ ఇవ్వాలని కలెక్టరు ఆదేశించారు. రోగులతో కలెక్టరు వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈఈ హాస్పిటల్ అన్లైన్ రిజిస్టరు, ఫార్మసీ రికార్డులు, డెలివరీ రిజిస్టర్, లేబరేటరీ తదితర రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో మందులు స్టాక్ అయిపోకముందే ఇండెంట్ చేసి తెప్పించు కోవాలన్నారు. ఆసుపత్రిలో అంతర్గత రోడ్లు, లైటింగ్ లేదని రోగులు కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం కలెక్టరు ఆర్టీసీ బస్టాండు ప్రాంగణాన్ని తనిఖీ చేసి సదుపాయాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.