కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:51 AM
మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో బెంగళూరుకు చెందిన రజిని (35), కూతురు కీర్తన(8) తుంగభద్ర నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుళ్లు అంజి, మల్లికార్జున స్వామి, హోం గార్డు నాగేశ్వర రెడ్డి తల్లి, కూతురిని ఒడ్డుకు చేర్చి వారికి స్థానిక వైద్యులతో వైద్యం చేయించారు.
తుంగభద్ర నదిలో దూకిన ఇద్దరిని రక్షించిన స్థానికులు, పోలీసులు
మంత్రాలయంలో ఘటన
మంత్రాలయం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో బెంగళూరుకు చెందిన రజిని (35), కూతురు కీర్తన(8) తుంగభద్ర నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుళ్లు అంజి, మల్లికార్జున స్వామి, హోం గార్డు నాగేశ్వర రెడ్డి తల్లి, కూతురిని ఒడ్డుకు చేర్చి వారికి స్థానిక వైద్యులతో వైద్యం చేయించారు. వివరాలివీ.. బెంగళూరుకు చెందిన సుంకార్ తట్టె కాలనీకి చెందిన బీఎన్ రజిని, బీఎన్ శివకుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పదోతరగతి, రెండో కూతురు కీర్తన రెండో తరగతి చదువుతోంది. రజిని తన ఇంటి పక్కన ఉన్న దివ్య అనే మహిళకు వడ్డీ వ్యాపారుల దగ్గర పూచీకత్తు ఉండి రూ.లక్షల్లో అప్పు ఇప్పించింది. మూడు నెలలైనా దివ్య తప్పించుకొని తిరుగుతోంది. దీంతో అప్పు ఇచ్చిన వారు పూచీకత్తు ఉన్న రజిని అప్పు చెల్పించాలని ఒత్తిడి చేయటంతో ఈనెల 1న చిన్న కూతురును తీసుకొని మంత్రాలయానికి వచ్చింది. తన భార్య, కూతురు కనిపించడం లేదని రజిని భర్త శివకుమార్ బెంగళూరులోని బ్యాగరి హళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం మంత్రాయం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోకి దూకిన వారిని అక్కడ ఉన్న స్థానికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి తల్లి, కూతురిని కాపాడారు. కూతురు కీర్తన తండ్రి సెల్ఫోన్ నెంబర్ ఇవ్వడంతో శివశంకర్కు సమాచారం ఇచ్చారు. శివశంకర్ బ్యాగర్ హళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడ సీఐ మంత్రాలయం ఎస్ఐ శివాంజల్కు ఫోన్లో మాట్లాడించారు. ప్రస్తుతం తల్లి, కూతరు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుమిత్రమ్మ, అంగన్ వాడీ టీచర్లు భీమేశ్వరి, కల్యాణి సమక్షంలో మంత్రాలయం పోలీసు స్టేషన్లో సురక్షితంగా ఉన్నారు. తల్లి కూతుళ్లను కాపాడిన గ్రామస్తులను, పోలీసులను గ్రామస్థులను అభినందించారు.