యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:06 AM
జూన్ 21వ తేదీన జిల్లా స్థాయిలో పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు.
8,15,000 మంది పేర్లు నమోదు
3న ఓర్వకల్లు రాతివనం వద్ద
12న కొండారెడ్డి బురుజు, 18న రాఘవేంద్రస్వామి మఠంలో కార్యక్రమాలు : కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జూన్ 21వ తేదీన జిల్లా స్థాయిలో పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో 8,15,000 మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసు కున్నారని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో మే 26నుంచి 30వరకు నిర్వహించిన యోగా పోటీల్లో 28809 మంది పాల్గొనగా 19,200 మంది విజేతలుగా నిలిచారన్నారు. గ్రామ, వార్డు స్థాయి విజేతలతో మండల, మున్సిపాలిటీ స్థాయిలో జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు, మండల, మున్సిపాలిటీ స్థాయి విజేతలతో జిల్లాస్థాయిలో జూన్ 9నుంచి జూన్ 14వ తేదీ వరకు జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్రస్థాయి పోటీలు జూన్ 17నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ఓర్వకల్లు రాతి వనం వద్ద జూన్ 3న, కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జూన్ 12వ తేదీన, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ఈ నెల 18వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. జూన్ 18వ తేదీ నగరంలో పారిశుధ్య కార్మికులను భాగస్వామ్యం చేస్తూ సామాజిక యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.