అగసనూరు టు కర్ణాటక
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:10 PM
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మండలంలోని అగసనూరు సమీపంలోని తుంగభద్ర నది నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.
తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక దందా
రోజూ 50 ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలింపు
పట్టించుకోని అధికారులు
కోసిగి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మండలంలోని అగసనూరు సమీపంలోని తుంగభద్ర నది నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కొన్నిరోజుల నుంచి తుంగభద్ర నది సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు చెందినవారు రోజూ 50 ట్రాక్టర్ల మేర ఇసుక యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలో నుంచి తుంగభద్ర నదిలోకి దిగి ట్రాక్టర్ల ద్వారా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఇసుకను ప్రతిరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వేళలో సుమారు 20 మంది కూలీలతో ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించి కర్ణాటక వాసులు బరితెగించి ఇక్కడి నుంచి ఇసుకను దోచుకెళ్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఆంధ్ర సరిహద్దులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, కర్ణాటక వాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.