20ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:13 PM
పత్తికొండ నుంచి మద్దికెర మండలంలోని పెరవలి, హంప, ఎడవలి, ఎం.అగ్రహారం మీదుగా గుంతకల్లుకు 20ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్సు నడిచేది.
గుంతకల్లుకు బస్సు సౌకర్యం
మద్దికెర మండలంలోని నాలుగు గ్రామాలకు సర్వీసుల పునరుద్ధరణ
మద్దికెర/తుగ్గలి ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ నుంచి మద్దికెర మండలంలోని పెరవలి, హంప, ఎడవలి, ఎం.అగ్రహారం మీదుగా గుంతకల్లుకు 20ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్సు నడిచేది. అప్పట్లో ఆటోల ప్రభావం వల్ల ఆ బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తమకు బస్సు నడపాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో శుక్రవారం సర్వీసులు ప్రారంభమయ్యాయి. రోజుకు రానుపోనూ నాలుగు సర్వీసులు నడవనున్నాయి. ఉదయం పత్తికొండలో 8 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. 9.30 గంటలకు గుంతకల్లు నుంచి బయలుదేరి 10.45 గంటలకు పత్తికొండకు చేరుకుంటుంది. అలాగే మధ్యాహ్నం 3.15 గంటలకు పత్తికొండ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. సాయంత్రం 4.45 గంటలకు గుంతకల్లు నుంచి బయలుదేరి 6 గంటలకు పత్తికొండకు చేరుకుంటుంది. వయా రాతన, తుగ్గలి, మద్దికెర మీదుగా ఈ బస్సు సర్వీసులు నడపనున్నారు. 20 ఏళ్ల తర్వాత బస్సు పునఃప్రారంభం కావడంతో ప్రయిణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీశక్తిలో భాగంగా ఆర్టీసీ వారు ఉచిత బస్సు నడపబోతుండడం ఆనందంగా ఉందని టీడీపీ తాలుకా అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడు అన్నారు.