ఆదోని జిల్లాను ప్రకటించాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:13 PM
ఆదోని డివిజన్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటిచేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
విద్యార్థి సంఘాల రాస్తారోకో
34వ రోజుకు చేరిన నిరసన దీక్షలు
ఆదోని అగ్రికల్చర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆదోని డివిజన్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటిచేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటు కోసం చేస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం 34వ రోజుకు చేరుకోగా విద్యార్థి సంఘాల నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని సాయి జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. భీమాస్ సర్కిల్లో దీక్షా శిబిరం వద్ద మానవహారం చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో గంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. టూటౌన్ ఎస్ఐ రామనాథ్ చేరుకుని నిరసన విరమించాలని ఆదేశించారు. దీంతో విద్యార్థి సంఘ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రిలే దీక్షల్లో బైఠాయించిన నాయకులు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంతంలో నేటికీ వేలమంది ఉపాధి లేక వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం 150కిలోమీటర్లు పైగా గ్రామీణ ప్రాంత వా సులు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదోని, ఆలూ రు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ సభ్యులు కృష్ణమూర్తి గౌడ్, అశోకానంద రెడ్డి, వీరేష్, రామలింగయ్య, సుజ్ఞానమ్మ, నాగరాజు, సీపీఐ నాయకులు రమేష్ కుమార్, షేక్షావలి, విద్యార్థి జేఏసీ నాయకులు షాబీర్ భాష తిరుమలేష్, రమేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.