హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:11 AM
పట్టణానికి చెందిన పుల్లయ్య (65)ను నవంబరు నెల 14న హత్య చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం నిందితులను జిల్లా పోలీసు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో చూపించారు.
నంద్యాల టౌన్ డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన పుల్లయ్య (65)ను నవంబరు నెల 14న హత్య చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం నిందితులను జిల్లా పోలీసు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో చూపించారు. దేవనగర్కు చెందిన పుల్లయ్యను వైఎస్ నగర్కు చెందిన ధనుంజయ, పెసరవాయికి చెందిన గంగాధర రాఘవ, కాటెపోగు సంతోష్, బిలకలగూడూరుకు చెందిన బెస్త శ్రీకాంత్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. భార్యతో విడాకులు తీసుకున్న పుల్లయ్య వీసీ కాలనీలో ఒంటరిగా ఉన్నాడని, తండ్రి ఫోన్ గత నెల 15 వ తేది నుంచి పని చేయక పోవడంతో బెంగళూరు నుంచి నంద్యాల వచ్చిన కుమారుడు ఆదిత్య ప్రసాద్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఇల్లు అమ్మి కోనే ప్రయత్నంలో ఉన్న పుల్లయ్య వద్ద డబ్బులు ఉన్నాయని, ఒంటరిగా ఉన్నాడని గమనించి ధనుంజయ గత నెల 14 న పని ఉందని బోలేరో వాహనంలో ఎక్కుంచుకుని గడివేముల దారికి తీసుకువెళ్లి రూ.25 లక్షలు డిమాండు చేశాడని తెలిపారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో పుల్లయ్యను ధనుంజయ, రాఘవ హత్యచేసి, మద్దూరు వద్ద కుందూ నదిలో పడేసినట్లు తెలిపారు. అనంతరం నంద్యాల వచ్చి మృతుడి ఇంటికి వెళ్లి ల్యాప్ట్యాప్, డీవీఆర్, డాక్యుమెంట్లు తీసుకొని పోయారని తెలిపారు. త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడు విచారణలో కాల్ డేటా, సీసీ కెమెరాల ఆధారంతో నలుగురు నిందితు లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి కత్తి, రెండు డీవీఆర్లు, ల్యాప్ ట్యాప్, విలువైన డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించినందుకు పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, త్రీటౌన్ పోలీసులు పాల్గొన్నారు.