జిల్లాలో 3,500 కొత్త పింఛన్లు
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:26 PM
జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 3,500 కొత్త పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్బాషా అన్నారు.
దూదేకొండలో పింఛన్లు మంజూరు చేసిన కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 3,500 కొత్త పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలసి పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో కలెక్టర్ నూతన పింఛన్లను పంపిణీ చేశారు. సామాజిక పింఛన్లను వేగంగా పంపిణీ చేయడంలో కర్నూలు జిల్లా టాప్లో నిలుస్తోందన్నారు. గతంలో పింఛన్ తీసుకుంటూ మృతిచెందిన వారి భార్యలు, లేదా భర్తలకు ఈ నెల స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కర్నూలు సమీపంలో చిన్నటేకూరు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలకు వారి భర్తలకు వచ్చే పింఛన్తోనే కుటుంబం గడిచేదన్నారు. వారు చనిపోవడంతో ఆ వృద్ధ మహిళలకు ఆసరా లేకుండా పోయిందన్నారు. ఆ ఇద్దరి గురించి సీఎం చంద్రబాబుతో జరిగిన కాన్ఫరెన్స్లో చర్చించానన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్, ఎంపీడీవో కవిత తదితరులు ఉన్నారు.