25 శాతం సీట్లు కేటాయించాల్సిందే
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:50 PM
బడుగు, బలహీనవర్గాల పిల్లలకు 12(1)(సి)చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠ శాలల్లో 25శాతం సీట్లు తప్పకుండా కేటాయించాల్సిందేనని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ ప్రేమంత్కుమార్ పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలు క్రమం తప్పకుండా అమలు చేయాలి
12(1)(సి)ని నిర్లక్ష్యం చేసే ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు
సర్వశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల పిల్లలకు 12(1)(సి)చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠ శాలల్లో 25శాతం సీట్లు తప్పకుండా కేటాయించాల్సిందేనని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ ప్రేమంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఏపీసీ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో తప్పకుండా పిల్లలను చేర్చుకో వాల్సిందేనని అన్నారు. 12(1)(సి)ని నిర్లక్ష్యం చేసిన ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. పిల్లలను చేర్చుకోకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారో, అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసు కోకూడదో వివరణ ఇవ్వాలని అన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహించే ఎంఈవోనే బాధ్యులను చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధార్ కార్డు లేని విద్యార్థులకు...
ఆధార్కార్డు లేని విద్యార్థులను సీఆర్పీల ద్వారా గుర్తించాలని, ఆ విద్యార్థులకు తహసీల్దార్ల చేత నాన్ అవైలబులిటీ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని ఏపీసీ ఎంఈవోలను ఆదేశించారు. ఎన్ఏసీ వచ్చిన తర్వాత నోటరీ చేయించి ఆ విద్యార్థి కుటుంబంలో ఉన్న ఏదో ఒక్క గుర్తింపు కార్డు తీసుకుని సచివాలయం వెళ్లి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయించాలని అన్నారు. ఆ తర్వాత ఆధార్ నమోదు నంబర్ను తీసుకోవచ్చన్నారు.
బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలి
బడి మధ్యలోనే మానేసిన పిల్లలను పాఠశాలల్లో తిరిగి చేర్పించేలా గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో అంగన్వాడీ లతో, సీఆర్పీలతో, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశాలు నిర్వహించి ప్రతి విద్యార్థిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీ సూచించారు. జూలై 5వతేదీన మెగా పేరెంట్స్ ఈవెంట్ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ ప్లానింగ్ జగన్, ఏఎంవో మాధవీలత, అసిస్టెంట్ ఏఎంవో యూనస్బాషా, అసిస్టెంట్ సీఎంవో క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.