వైసీపీవి దిగజారుడు రాజకీయాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:46 PM
తల్లికి వందనం పథకాన్ని చూసి ఓర్వలేని మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు కూటమి ప్రభు త్వంపై, విద్యా మంత్రి నారా లోకేశ్పై దిగజారుడు రాజకీయాలతో విష ప్రచారం చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు.
ఆ పార్టీని ప్రజలు నమ్మరు
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
బనగాన పల్లె, జూన్ 14 ( ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకాన్ని చూసి ఓర్వలేని మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు కూటమి ప్రభు త్వంపై, విద్యా మంత్రి నారా లోకేశ్పై దిగజారుడు రాజకీయాలతో విష ప్రచారం చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశం బీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులకు, వారి తల్లులకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8700 కోట్లు జమచేశామన్నారు. ఇలాంటి పథకం మీద దుష్ప్రచారం చేస్తున్న వైసీపీని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, పీ.వీ.కుమార్రెడ్డి, దొనపాటి భస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.