పెదపులిపాక ఇసుక రోడ్డుకు మహిళ బలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:08 AM
పెదపులిపాకలో ఇసుకతో నిండిపోయిన ప్రధాన రోడ్డు గురువారం ఒక మహిళను బలితీసుకొంది.
భర్తతో కలిసి కరకట్ట మీదుగా తాడిగడప వస్తుండగా ప్రమాదం
ఇసుకలో స్కిడ్ అయిన ద్విచక్రవాహనం.. పాఠశాల వ్యాను కింద పడి దుర్మరణం
పెనమలూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పెదపులిపాకలో ఇసుకతో నిండిపోయిన ప్రధాన రోడ్డు గురువారం ఒక మహిళను బలితీసుకొంది. వివరాల్లోకి వెళితే తాడిగడపకు చెందిన చిలుమూరి శ్రీనివాస్, శిరీష(38) భార్యాభర్తలు. శ్రీనివాస్ అవనిగడ్డలో సబ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం తాడిగడప శ్రీనివాసనగర్ కట్ట వద్ద ఉన్న తమ ఇంటికి భార్యాభర్తలిద్దరూ మోటారు సైకిల్పై వస్తున్నారు. పెదపులిపాక గ్రామంలోని ప్రధాన రోడ్డుపైన ప్రయాణిస్తుండగా వెనుక నుంచి పాఠశాల వ్యాను వస్తోంది. వ్యాను కు దారిచ్చేందుకు శ్రీనివాస్ మోటారుసైకిల్ను రోడ్డుకు ఒక పక్కకు తీసుకెళ్లారు. ఇసుకలోకి వెళ్లిన మోటారుసైకిల్ టైరు స్కిడ్ అయింది. దీంతో శిరీష కింద పడిపోయింది. వెనుక నుంచి వ్యాను శిరీష తలపైకి ఎక్కడంతో తల నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు శిరీషను పక్కకు తీసి పాఠశాల వ్యానును ఆపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇసుకతో నిండిపోయిన పెదపులిపాక ప్రధాన రోడ్డు
పెదపులిపాక ప్రధాన రోడ్డు టిప్పర్లు, ట్రాక్టర్లు తెస్తున్న ఇసుకతో నిండిపోయింది. బైక్లపై ప్రయాణించేవారు ఇబ్బంది పడుతున్నారు. వారం క్రితం కరకట్టపై టిప్పరు ఢీకొనడంతో ఒక వాహనదారుడు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదే రోజు మరొకరి బైక్ టైరు టిప్పరు కింద నలిగిపోయింది. ఇంతలోనే పాఠశాల వ్యాన్ కింద మహిళ దుర్మరణం చెందడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతు న్నారు. గ్రామంలోకి ఇసుక టిప్పర్లు, భారీ వాహనాలు రాకుండా గడ్డర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదంటున్నారు.