Share News

వివాహంలో విషాదం

ABN , Publish Date - May 09 , 2025 | 12:49 AM

వివాహ వేడుకలకు ఉత్సాహంగా బయల్దేరిన రెండు, మూడు నిమిషాలకే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ట్రాక్టర్‌ బోల్తాపడి గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

వివాహంలో విషాదం
విన్నకోటలో బోల్తా పడిన ట్రాక్టర్‌

పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా

ఇద్దరు యువకులు దుర్మరణం

ఐదుగురికి తీవ్రగాయాలు

ట్రాక్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే..

గుడ్లవల్లేరు, మే 8 (ఆంధ్రజ్యోతి) : వివాహ వేడుకలకు ఉత్సాహంగా బయల్దేరిన రెండు, మూడు నిమిషాలకే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ట్రాక్టర్‌ బోల్తాపడి గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుడ్లవల్లేరు పోలీసుల కథనం మేరకు.. విన్నకోట గ్రామానికి చెందిన చేబ్రోలు ఆదాం కుమార్తె వివాహం నందివాడ మండలం గాజులపాడు గ్రామంలో గురువారం జరిగింది. పెళ్లికూతురు బంధువులు ముందుగా బస్సు, కారు, ఆటోలో విన్నకోట దళితవాడ నుంచి బయల్దేరి వెళ్లారు. కొంతసేపటికి గ్రామంలోని 20 మంది.. ఓ ట్రాక్టర్‌లో బయల్దేరారు. ట్రాక్టర్‌ నడుపుతున్న డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల సరిగ్గా వందమీటర్లు ముందుకు వెళ్లేసరికి అంగన్వాడీ కేంద్రం సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న చేనులోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌తో పాటు గ్రామస్తులు కూర్చున్న ట్రక్కు కూడా తిరగబడింది. ఈ ఘటనలో ముత్యాల అరుణ్‌బాబు (16), కనకవల్లి అభిషేక్‌ (15) అక్కడికక్కడే మృతిచెందారు. మెండ రవికిరణ్‌, కూర్యా నాగరాజుకు తీవ్రగాయాలు కాగా, మరికొందరికి గాయాలై గుడివాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఏఎస్‌ఐ వి.బాల వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను విన్నకోటకు తరలించారు.

ఆధారం అవుతాడనుకున్న కొడుకు మృత్యుఒడికి..

విన్నకోట దళితవాడకు చెందిన ముత్యాల నాగరాజు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన అరుణ్‌బాబు గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఉన్నత విద్యావంతుడై కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశతో ఉన్న కుటుంబానికి ఈ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

అమ్మమ్మ తాతయ్యకు విషాదాన్ని మిగిల్చి..

తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో అమ్మమ్మ సముద్రవేణి, తాతయ్య రాఘవులు వద్ద పెరుగుతున్నాడు అభిషేక్‌. తల్లి పనిచేసేందుకు కువైట్‌ వెళ్లగా, అభిషేక్‌, అతని చెల్లెలు విన్నకోటలో వృద్ధ దంపతుల వద్ద ఉంటున్నారు. అభిషేక్‌ను తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో తమకు అప్పగించి వెళ్లిన కూతురికి ఏం చెప్పాలి తెలియక ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - May 09 , 2025 | 12:49 AM