సమయం ఆసన్నం
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:48 AM
యోగా వేడుకకు సర్వంసిద్ధమైంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా యోగాసనాలు వేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
నేడు జిల్లావ్యాప్తంగా యోగా డే
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
బెజవాడలోని ఐజీఎంసీలో భారీగా యోగా
ఎన్టీఆర్ జిల్లాలో 9 లక్షల మందితో
కృష్ణాజిల్లాలో 8.20 లక్షల మందితో ఆసనాలు
ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న ఔత్సాహికులు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఎల్ఈడీ స్ర్కీన్లు, ల్యాప్టాప్ సదుపాయాలు
ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం : యోగా వేడుకకు సర్వంసిద్ధమైంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా యోగాసనాలు వేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున యోగా నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 9 లక్షల మందితో ఆసనాలు వేయించేందుకు సర్వం సిద్ధం చేశారు. అలాగే, 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా యోగా డే జరపనున్నారు. వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేసే యోగాసనాలను ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించనున్నారు. ఇందుకోసం ప్రతి సచివాలయం పరిధిలో ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారాలకు వీలుగా ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించారు. కృష్ణాజిల్లా స్థాయి యోగా కార్యక్రమం ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5 వేల మంది పాల్గొంటారు. ఆయుష్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 4,470 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లావ్యాప్తంగా 8,20,496 మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు.