అందంగా..
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:42 AM
భవానీ ద్వీపానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. భారీ వరదలకు ఇసుక మేటలతో నిండిపోయిన ద్వీపం పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఐదడుగుల ఎత్తున భవానీ ద్వీపాన్ని కప్పేసిన ఇసుకను వందలాది ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. దీంతో భవానీద్వీపం కొత్తరూపాన్ని సంతరించుకుంటోంది.

వెలిగిపోతున్న భవానీ ఐల్యాండ్
వరదల అనంతరం కొత్తరూపు
ఐదడుగుల మేర పేరుకున్న ఇసుక
90 శాతం పూర్తయిన తొలగింపు పనులు
త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భవానీ ద్వీపానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. భారీ వరదలకు ఇసుక మేటలతో నిండిపోయిన ద్వీపం పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఐదడుగుల ఎత్తున భవానీ ద్వీపాన్ని కప్పేసిన ఇసుకను వందలాది ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. దీంతో భవానీద్వీపం కొత్తరూపాన్ని సంతరించుకుంటోంది. ఇసుక మేటల తొలగింపుతో పాతవేలు బయటపడ్డాయి. జంగిల్ ఏరియాలోని మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్, రోబోటిక్ పార్క్ వంటి వాటి దగ్గర కూడా ఇసుకను తొలగించి అభివృద్ధి చేశారు. మేజ్ గార్డెన్ ఏరియాలో చాలావరకు ఇసుక తొలగించినా.. మొక్కల మధ్యన ఉన్న పాతవేలపై ఇసుక మేట వేయడంతో అక్కడ పనులు చేపట్టారు. కాగా, ఇటీవల ద్వీపాన్ని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ సందర్శించారు. ఇదే సందర్భంలో కొత్తగా ఈడీగా ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోనే ఈ అభివృద్ధి పనులు జరిగాయి. మరో 10 శాతం తొలగింపు పనులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పర్యాటకుల రాకపోకలు మొదలు కాగా, వారంలో మేజ్ గార్డెన్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మ్యూజికల్ ఎక్విప్మెంట్లు, చిన్నారుల ఆటస్థలం, ఫౌంటేన్లు, సెల్ఫీ పాయింట్స్ అన్నీ బయటపడ్డాయి. రివర్ వ్యూ పాయింట్తో బోటింగ్ పాయింట్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను కూడా పూర్తిగా తొలగించారు.