Share News

రూ.500 దర్శనం రద్దు చేద్దామా?

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:09 AM

గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు కాబట్టి.. ఈ క్యూకు ఉత్సవాలు ముగిసే వరకు ఫుల్‌స్టాప్‌ పెడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచన చేస్తున్నారు.

రూ.500 దర్శనం రద్దు చేద్దామా?

దసరా ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా చూసే యోచన

రూ.500 టికెట్‌ దర్శనం రద్దుచేసే దిశగా ఆలోచనలు

ఏటా ఉత్సవాల్లో భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణం

ఉచిత, రూ.100, రూ.300 దర్శనాల్లో త్వరగా దుర్గమ్మ దర్శనం

రూ.500 లైన్‌ మాత్రం గంటల తరబడి కదలని వైనం

సహనం నశిస్తున్న భక్తులు.. అధికారులపై నినాదాలు

ఈ ఉత్సవాల్లో ఆ పరిస్థితి లేకుండా చూడాలనే యోచనలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు కాబట్టి.. ఈ క్యూకు ఉత్సవాలు ముగిసే వరకు ఫుల్‌స్టాప్‌ పెడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచన చేస్తున్నారు. దీనిపై మరింత కసరత్తు చేశాక తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

రూ.500 దర్శనం లైన్‌లో అవస్థలు

ఏటా శరన్నవరాత్రుల్లో ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఉచిత దర్శనం చేసుకునే భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఉంటాయి. ఈ రెండూ వినాయకుడి ఆలయం నుంచి మొదలై ఘాట్‌రోడ్డు మీదకు వస్తాయి. ఇవికాకుండా రూ.100, రూ.300, రూ.500 క్యూలను ఏర్పాటు చేస్తారు. రూ.500 క్యూలైన ఓం మలుపు వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ టికెట్‌ కొన్న భక్తులు ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే క్యూలైనకు అనుబంధంగా మీడియా పాయింట్‌ సమీపాన మరో క్యూ ఉంటుంది. వాస్తవానికి రూ.500 టికెట్లు తీసుకున్నవారు, ప్రొటోకాల్‌ జాబితాలోని వ్యక్తుల సిఫార్సులతో వచ్చే వీఐపీలు ఓం మలుపు నుంచి దర్శనానికి వెళ్లాలి. రూ.500 టికెట్లు తీసుకున్న భక్తులు మాత్రమే ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు. సిఫార్సు లేఖలతో వచ్చినవారు నేరుగా చినరాజగోపురం వద్దకు వచ్చి అక్కడ ఉన్న క్యూలోకి వెళ్తున్నారు. దీనివల్ల ఓం మలుపు వద్ద నుంచి క్యూలోకి వచ్చిన భక్తులు అమ్మవారి గోపురం వద్దకు చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 క్యూల్లోని భక్తులకు దర్శనం వేగంగా జరుగతోంది. దీంతో రూ.500 క్యూలో ఉన్న భక్తులు అసహనానికి గురవుతున్నారు.

గత అనుభవాల నేపథ్యంలో..

దుర్గగుడి ఈవో శీనానాయక్‌ దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు, మూడేళ్ల ఉత్సవాలను ప్రామాణికంగా తీసుకుని నాటి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. రూ.500 క్యూలోనే భక్తులు దర్శనం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయా విభాగాల అధికారులు వివరించినట్టు తెలిసింది. ఏటా శరన్నవరాత్రుల్లో మొదటి ఐదు రోజులు టికెట్లను భక్తులు తీసుకుంటారు. మూల నక్షత్రం రోజున వేలమంది అమ్మవారి దర్శనానికి వస్తారు. ఆరోజు అన్ని క్యూల్లో ఉచిత దర్శనం అమలు చేస్తారు. ఆ తర్వాత నుంచి భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. దేవస్థాన సిబ్బంది టికెట్ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, ప్రతి దసరా ఉత్సవాల్లో రూ.500 టికెట్లు కొన్న భక్తులు మాత్రం దర్శనం ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు భక్తులు క్యూలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుంచి నిరసనలు పెరుగుతున్న తరుణంలో శరన్నవరాత్రుల్లో అసలు రూ.500 టికెట్‌ క్యూను రద్దుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం మాత్రమే జరిగింది. త్వరలో జరిగే మరిన్ని సమావేశాల్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Aug 06 , 2025 | 01:09 AM