అరాచక అభిమానం
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:04 AM
అభిమానం ముసుగులో అరాచకం సృష్టించారు. పైశాచికానందంతో మొక్కల్ని ముక్కలు చేశారు. క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ విజయం సాధించడంతో ఆకతాయి గ్యాంగ్లు గత మంగళవారం రాత్రి నగరంలో బీభత్సం సృష్టించారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకున్న వారిలా, మద్యం తాగిన వారిలా ప్రవర్తించారు.
నగరంలో రెచ్చిపోయిన ఆకతాయిలు
ఆర్సీబీ విజయంతో రోడ్లపై హల్చల్
రోడ్లపై బారికేడ్లను లాక్కెళ్లిన ఇద్దరు యువకులు
డివైడర్పై మొక్కలు ధ్వంసం చేసి అసభ్య నృత్యాలు
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
ఇద్దరు యువకుల అరెస్టు.. రిమాండ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అభిమానం ముసుగులో అరాచకం సృష్టించారు. పైశాచికానందంతో మొక్కల్ని ముక్కలు చేశారు. క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ విజయం సాధించడంతో ఆకతాయి గ్యాంగ్లు గత మంగళవారం రాత్రి నగరంలో బీభత్సం సృష్టించారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకున్న వారిలా, మద్యం తాగిన వారిలా ప్రవర్తించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బందరురోడ్డు, ఏలూరురోడ్డులో వీరు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బందరురోడ్డులోని తాజ్ వివంతా వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా, బైకులపై ఊరేగింపుగా వచ్చిన ఇద్దరు యువకులు వాటిని లాక్కుపోయారు. ఒకరు బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న యువకుడు బారికేడ్ను లాక్కుని వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక దానిపై ఎక్కి గంతులు వేశారు. మరో గ్యాంగ్ బందరు రోడ్డులో ఎంఅండ్ఎం ఎదురుగా ఉన్న సెంటర్ డివైడర్పై నాటిన మొక్కలను విరిచేసింది. కొంతమంది ఎత్తుగా ఎదిగిన మొక్కలు పీకేసి వాటితో ర్యాలీలు చేశారు. ఈ వీడియోలను చిత్రీకరించిన ఇంకొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు పోలీసులకు చేరాయి. యువకుల బైక్ నెంబర్ల ఆధారంగా వారి చిరునామాను గుర్తించారు. విధ్వంసం సృష్టించినవారు రామలింగేశ్వరనగర్కు చెందిన సాయి, పవన్గా నిర్ధారించారు. వారిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకులిద్దరూ బీటెక్ చదువుతున్నట్టు తెలిసింది. వారిని స్పెషల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి రిమాండ్ విధించారు.