జోరువాన
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:39 AM
జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షం వరిపైరుకు కొంతమేర ఊపిరిపోసింది. 15 రోజులుగా జిల్లాలో ఆశించిన మేర వర్షం కురవకపోవడంతో పాటు కాల్వల ద్వారా సక్రమంగా సాగునీరు అందక వరినాట్లు వేసిన పొలాల్లోని పైరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందక రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా కాల్వల వెంబడి తిరిగారు. నీటిమట్టం పెరగకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పొలాలకు మళ్లించే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో రైతులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో రెండోరోజూ కురిసిన వర్షం
గుడివాడలో రోడ్లు జలమయం
వరికి ఊపిరినివ్వడంతో రైతుల్లో ఆనందం
నేడూ కురిసే అవకాశం : వాతావరణ శాఖ
మచిలీపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షం వరిపైరుకు కొంతమేర ఊపిరిపోసింది. 15 రోజులుగా జిల్లాలో ఆశించిన మేర వర్షం కురవకపోవడంతో పాటు కాల్వల ద్వారా సక్రమంగా సాగునీరు అందక వరినాట్లు వేసిన పొలాల్లోని పైరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందక రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా కాల్వల వెంబడి తిరిగారు. నీటిమట్టం పెరగకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పొలాలకు మళ్లించే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో రైతులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. వారం పాటు సాగునీటికి ఇబ్బంది లేదని ఆనందపడ్డారు. కాగా, శనివారం కోస్తాతీరం వెంబడి భారీవర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈనెల 23 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, గుడివాడలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. గుడివాడ-బంటుమిల్లి రహదారిపై వర్షపునీరు చేరింది. పమిడిముక్కల మండలంలో అత్యధికంగా 97.2 మిల్లీమీటర్లు, బాపులపాడులో అత్యల్పంగా 3.6 మిల్లీమీటర్లు, జిల్లా సగటు వర్షపాతం 30.1 మిల్లీమీటర్లుగా నమోదైంది.