Share News

లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు నిరూపించండి

ABN , Publish Date - May 09 , 2025 | 01:03 AM

లిక్కర్‌ స్కామ్‌లో తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) సవాల్‌ విసిరాలు. జగన్‌ పాలనలో జరిగిన రూ.3,600 కోట్ల స్కామ్‌ నుంచి దృష్టి మరల్చేందుకు వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన వద్ద పాలేరుగా పనిచేస్తున్న మాజీ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు నిరూపించండి
జగన్‌ పత్రికలో వచ్చిన తప్పుడు కథనాన్ని మీడియాకు చూపిస్తున్న ఎంపీ కేశినేని చిన్ని

లేదంటే సీబీఐ విచారణ కోరండి

కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు..!

పది రోజుల కిందటే హైదరాబాద్‌లో గ్రూపు చర్చలు

నాడు మాట్లాడని నాని ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు?

జగన్‌కు పాలేరుగా మారి డైవర్షన్‌ పాలిటిక్సా..

స్థలాల విషయంలో మాత్రమే కసిరెడ్డితో సంబంధం

జగన్‌ వెంట ఉన్నాడని తెలిసి బయటకొచ్చేశా..

ఈ స్కామ్‌లో ఉన్నది జగన్‌ దంపతులే..

మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్‌

వన్‌టౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : లిక్కర్‌ స్కామ్‌లో తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) సవాల్‌ విసిరాలు. జగన్‌ పాలనలో జరిగిన రూ.3,600 కోట్ల స్కామ్‌ నుంచి దృష్టి మరల్చేందుకు వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన వద్ద పాలేరుగా పనిచేస్తున్న మాజీ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గురునానక్‌ కాలనీలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా జగన్‌.. తన పాలేరుతో పాటు మరో నలుగురు కలిసి పది రోజుల క్రితం హైదరాబాద్‌లో కలిసి తనపై బురద చల్లేందుకు వ్యూహరచన చేశారన్నారు.

కసిరెడ్డిని అలా పక్కనపెట్టా..

కేశినేని ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (అమెరికా), కేశినేని ఎంటర్‌ప్రైజెస్‌ దుబాయ్‌ కంపెనీల ద్వారా తాను డబ్బు తరలించినట్లు జగన్‌రెడ్డి పత్రికలో తప్పుడు కథనం అల్లారని ఎంపీ మండిపడ్డారు. ఈ కంపెనీలు ఎవరి పేరుమీద ఉన్నాయో, లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారులు ఎవరో నిగ్గు తేల్చటానికి దమ్ముంటే.. 24 గంటల్లో జగన్‌ సీబీఐ విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఈ విషయంలో సీబీఐ విచారణ జరపాలంటూ చిన్ని లేఖ కూడా రాశారు. సోషల్‌ మీడియా వేదికగా తనపై లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. జగన్‌ ఆలోచనలను కేశినేని నాని అమలు చేస్తూ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి స్థలం పక్కనే తనకు కూడా స్థలం ఉందని, రాకపోకలు సాగించేందుకు తన స్థలం నుంచే అవకాశం ఉండటంతో ఇద్దరం కలిసి డెవలప్‌మెంట్‌ చేయటానికి ఓ కంపెనీని ఏర్పాటు చేశామని చెప్పారు. 2020-21లో నాలుగైదు సార్లు కసిరెడ్డిని కలిశానన్నారు. జగన్‌తో కసిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని తెలియటంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకుని బయటకు వచ్చానని, నాటి నుంచి అతనితో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మరల్చటానికి జగన్‌ బ్యాచ్‌ చేస్తున్న కుట్రల్లో భాగంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

స్కామ్‌లో జగన్‌ దంపతులు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,600 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో భాగస్వాములు ఎవరు, సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది అందరికీ అర్థమవుతోందని చెప్పారు. సుప్రీంకోర్టులో తాజాగా బెయిల్‌ నిరాకరణకు గురైన మాజీ ఐఏఎస్‌ ఆధ్వర్యంలో ఈ లిక్కర్‌ స్కామ్‌ జరిగిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో నాల్గో నెంబర్‌ గది వైపునకే వేళ్లు చూపిస్తున్నాయన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ దంపతులిద్దరూ ఉన్నారని ఎంపీ ఆరోపించారు. రాజ్‌ కసిరెడ్డికి, మాజీ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఆ గదిలోకి ఎంట్రీ ఉందన్నారు. పదిరోజుల కిందట హైదరాబాద్‌లో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పతో సహా కేశినేని నాని సమావేశం జరిపారన్నారు. ఈ సమావేశంలో విజయవాడకు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న తన వివరాలను సేకరించి నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదారు ఏళ్ల కిందటే జగన్‌కు కేశినేని నాని అమ్ముడుపోయాడని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా నిత్యం జగన్‌కు మెసేజ్‌లు పంపిస్తూ కోవర్టుగా పనిచేశాడన్నారు. జగన్‌ హయాంలోనే లిక్కర్‌ స్కామ్‌, శాండ్‌ స్కామ్‌ జరిగాయని, అప్పుడు కేశినేని నాని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఆరోజు స్కామ్‌లో డబ్బు అందినందుకే ఆయన మాట్లాడలేదని మండిపడ్డారు. దుబాయ్‌, అమెరికాలో ఉన్న కంపెనీలు పాలేరుకు చెందినవా లేదా జగన్‌రెడ్డికి చెందినవా నిగ్గు తేలాలన్నారు. గతంలో చిరంజీవి పార్టీలోకి వెళ్లి బయటకు వచ్చిన కేశినేని నాని.. ఆ తర్వాత చిరంజీవినే విమర్శించారని గుర్తుచేశారు. వెదవ వేషాలను చూసే పార్టీ నుంచి తప్పించారన్నారు. తాను పార్టీలు మారలేదని, ఇకముందూ మారేది లేదని, జీవితాంతం టీడీపీలో ఉంటానని, తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.

దేశం గర్వించదగిన సైన్యం

దేశ ప్రజలు గర్వపడేలా ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసిందని, ఇది దేశం గర్వించదగిన విషయమని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. పెహల్గాం దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్య అని, ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 01:03 AM