ఆ 4 గ్రామాలు
ABN , Publish Date - May 09 , 2025 | 01:01 AM
రాజధానిలో సోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు సీఆర్డీఏ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలోని త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాజధాని పరిధిలో కలపడానికి సన్నాహాలు
ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడం కోసమే..
నాలుగు గ్రామాల్లో 5 వేల ఎకరాల సేకరణకు యత్నాలు
గ్రామసభలు పెట్టి వివరించిన రెవెన్యూ అధికారులు
భూ సమీకరణ కింద భూములివ్వడానికి రైతుల అంగీకారం
ఇప్పటికే మూలపాడులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదన.. త్వరలో స్పోర్ట్స్ వర్శిటీ కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలోని మరో నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ గ్రామాలు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. వీటిని రాజధానిలోకి తీసుకురావాలన్న ఆలోచనలు జరుగుతున్నాయి. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి, మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లోని భూములను భూ సమీకరణ కింద తీసుకుని రాజధానిలో ప్యాకేజీ కల్పించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నాలుగు గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి అక్కడి రైతులు అంగీకరించారు. అయితే, తమకు ఇచ్చే ప్యాకేజీ గురించి సమాచారాన్ని అడిగారు. మరో సమావేశంలో వీటిపై స్పష్టత ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు.
స్పోర్ట్స్ సిటీ కోసమే..
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 5 వేల ఎకరాల వరకు అవసరమవుతాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మూలపాడులో క్రికెట్ స్టేడియం ఉంది. ఈ ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణానదిలో ద్వీప ప్రాంతాలైన చినలంక, పెదలంకలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ఇంతకుముందు భావించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఎంపీ కేశినేని చిన్ని ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ రెండూ రాజధానికి అత్యంత సమీపాన ఉండే దీవులు కావడంతో అప్పట్లో పరిశీలించారు. అయితే, వరదలు వచ్చినపుడు ఈ దీవులు మునిగిపోతాయన్న విషయం తెలియటంతో ఆ తర్వాత పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రాజధానిలో స్పోర్ట్స్ సిటీకి అనువైన ప్రాంతాలను కొద్దిరోజులుగా అన్వేషిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు, త్రిలోచనపురం, జమీమాచవరం ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలన్నీ కృష్ణాతీరానికి సమీపాన ఉన్నాయి. మూలపాడులో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రైవేట్ స్టేడియం కూడా ఉంది. మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా అమరావతికి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ఇప్పటికే నిర్ణయించింది. పైగా ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి వచ్చే వారికి దగ్గరగా ఉండటంతో పాటు అమరావతికి గేట్వేగా మారుతుంది. దీంతో అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ వే ఐకానిక్ బ్రిడ్జిని ఈ ప్రాంతం మీదుగానే నిర్మించాలన్న నిర్ణయానికి సీఆర్డీఏ వచ్చింది. మూలపాడులో క్రీడా స్టేడియాలు ఏర్పాటుకు అనువుగా ఉండటంతో కొటికలపూడి, జమీమాచవరం, త్రిలోచనాపురం గ్రామాలను కూడా అనువైన ప్రాంతాలుగా నిర్ణయించారు.