Share News

‘సీడ్‌..’ స్పీడ్‌గా..

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:57 AM

రైతుల సానుకూలతతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు లైన్‌క్లియర్‌ అవుతోంది. ఈ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టిన సీఆర్‌డీఏకు రాజధాని రైతులు శుభ సంకేతాలు ఇస్తున్నారు. ఉండవల్లిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పరిధిలో భూములు కలిగిన 22 మంది రైతులు తమ 14 ఎకరాలను ఇవ్వటానికి అంగీ కారం తెలిపారు.

‘సీడ్‌..’ స్పీడ్‌గా..

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు లైన్‌క్లియర్‌

14 ఎకరాలు ఇచ్చిన 22 మంది రాజధాని రైతులు

సీఆర్‌డీఏ కమిషనర్‌కు అంగీకారపత్రాల అందజేత

రెండో దశ పనులకు శ్రీకారం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైతుల సానుకూలతతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు లైన్‌క్లియర్‌ అవుతోంది. ఈ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టిన సీఆర్‌డీఏకు రాజధాని రైతులు శుభ సంకేతాలు ఇస్తున్నారు. ఉండవల్లిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పరిధిలో భూములు కలిగిన 22 మంది రైతులు తమ 14 ఎకరాలను ఇవ్వటానికి అంగీ కారం తెలిపారు. ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 25 వరకు కోర్టు కేసులున్నాయి. దీంతో మొదటి దశలోనే రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది.

రెండోదశ విస్తరణలో సానుకూల సంకేతాలు

రెండోదశ విస్తరణ పనుల్లో భాగంగా ఉండవల్లి నుంచి పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నాహాలు చేపట్టారు. మంగళగిరిలోని సుందరయ్య కాలనీ మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తూ ఎన్‌హెచ్‌-16కు ఈ రోడ్డును అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌కు కూడా సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో పాటు ఈ-11, 13 రోడ్లను కూడా సమాంతరంగా ఎన్‌హెచ్‌-16 వరకు విస్తరించటానికి ఇప్పటికే సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. వీటి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది. ఇంతకుముందు మంత్రి నారాయణ పిలుపు మేరకు పలువురు రైతులు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు భూములిచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న భూముల్లో పనులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో సీఆర్‌డీఏ అధికారులు ముందడుగు వేశారు. ప్రస్తుతం రెండోదశలో ఎర్త్‌వర్క్‌ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిగులు భూములకు సంబంధించి కూడా రాజధాని రైతులు ముందుకు వస్తుండటంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును త్వరలోనే పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు.

మరికొంతమంది రైతుల అంగీకారం

మొదట్లో భూములు ఇవ్వటానికి ససేమిరా అన్న కొంతమంది రైతులు ఇప్పుడు ఓకే.. చెబుతున్నారు. భూ సమీకరణ కింద పెనుమాకలో 28.25 ఎకరాలు ఇవ్వడానికి 14 మంది రైతులు గురువారం అంగీకార పత్రాలు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఆందించారు. అలాగే, ఉండవల్లిలో 22 మంది రైతులు 14 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈ భూముల కారణంగా కొండవీడు వాగు వరద నిర్వహణ పనులతో పాటు పలు అంతర్గత రహదారుల అనుసంధాన పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Oct 17 , 2025 | 12:57 AM