వైసీపీ కార్యాలయం వద్ద పేర్ని నాని హల్చల్ చేయడం విడ్డూరం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:07 AM
శిడింబి అగ్రహారంలో విలేకరుల సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు మాట్లాడారు.

కార్యాలయ వ్యవహారం న్యాయస్థానంలో ఉంటే కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు?: టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు
మచిలీపట్నం టౌన్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ కార్యాలయ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. తుదితీర్పు వచ్చే వరకు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయినా వైసీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి పేర్ని నాని, తన అనుచరులతో హల్చల్ చేశారు. ఇది విడ్డూరంగా ఉంది.’ అని టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు అన్నారు. బుధవారం శిడింబి అగ్రహారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయం వద్ద కార్యక్రమాలు నిర్వహించొద్దన్న అధికారులపై పేర్ని నాని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో మునిసిపల్ కమిషనర్ చంద్రయ్యపై ఒత్తిడి తెచ్చి ఆయనను జైలుకు పంపేలా చేశారన్నారు. రెవెన్యూ అధికారి వెంకటే్షను సస్పెండ్ చేయించేందుకు ముని సిపల్ కమిషనర్పై పేర్ని నాని ఒత్తిడి తీసుకొచ్చింది నిజమా..కాదా అని నిలదీశారు. అధికారులను బెదిరించి వైసీపీ కార్యాలయం నిర్మాణం కో సం అగమేఘాల మీద కౌన్సిల్లో తీర్మానం చేయించారన్నారు. అప్పట్లో ఎంపీ బాలశౌరి చెప్పినప్పటికీ మునిసిపల్ కౌన్సిల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య భవన నిర్మాణానికి ఎన్వోసీ ఇచ్చేందుకు తీర్మానం చేయలేదన్నారు. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పి.వి.ఫణికుమార్, గంజాల రవికుమార్, కొనకళ్ల భాను పాల్గొన్నారు.