వైభవోపేతంగా..
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరగుతున్న చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజు శుక్రవారం నంది వాహనంపై గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వరులు నగర వీధుల్లో వైభవంగా ఊరేగారు.

నంది వాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరుల ఊరేగింపు
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరగుతున్న చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజు శుక్రవారం నంది వాహనంపై గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వరులు నగర వీధుల్లో వైభవంగా ఊరేగారు. ఉద యం వేద పండితులు, అర్చకులు మూల మంత్ర హవనములు నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ఇతర వైదిక కార్యక్రమా లతో పాటు ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి మల్లేశ్వర మహా మండపం నుంచి గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అల కరిం చిన నంది వాహనంపై ఊరేగారు. సంప్రదాయ కళలైన తప్పెట్లు, మహిళల కోలాట నృత్యాలు, చిన్నారుల కోలాట ప్రదర్శన, తాళం భజన ప్రదర్శన ముందుకు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నంది వాహన సేవ శ్రేణి కనకదుర్గానగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ బజార్ మీదుగా తిరిగి కొండపై వరకు ఊరేగింపు కొనసాగింది. ఆది దంపతులు వేంచేసిన నంది వాహనం ముందు ఆయా ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధిచేసి, హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సం ఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.