శరవేగంగా..
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:56 AM
విజయవాడ-కాజీపేట థర్డ్లైన్ ప్రాజెక్టులో అంతర్భాగంగా గుణదల-వెదురుపావులూరు మధ్య ఎలివేటెడ్ రైల్వేలైన్ అయిన రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఏపీ, తెలంగాణాను కలుపుతూ నిర్మిస్తున్న ఈ మూడో లైన్లో అంతర్భాగంగా విజయవాడ పరిధిలో బైపాస్ రైల్వేలైన్ను నిర్మిస్తున్నారు.
ఎలివేటెడ్ ఆర్వోఆర్
గుణదల-వెదురుపావులూరు వద్ద పనులు
విజయవాడ-కాజీపేట మూడోలైన్లో అంతర్భాగం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ-కాజీపేట థర్డ్లైన్ ప్రాజెక్టులో అంతర్భాగంగా గుణదల-వెదురుపావులూరు మధ్య ఎలివేటెడ్ రైల్వేలైన్ అయిన రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఏపీ, తెలంగాణాను కలుపుతూ నిర్మిస్తున్న ఈ మూడో లైన్లో అంతర్భాగంగా విజయవాడ పరిధిలో బైపాస్ రైల్వేలైన్ను నిర్మిస్తున్నారు. ఈ లైన్లో రెండు ఆర్వోఆర్లను తలపెట్టారు. విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి రాయనపాడు వరకు ఒక ఆర్వోఆర్, విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి గుణదల మీదుగా వెదురుపావులూరు వరకు మరో ఆర్వోఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో గుణదల-వెదురుపావులూరు మార్గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కిలోమీటర్ల నిడివిలో జరుగుతున్నాయి. విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి గుణదల వరకు మూడోలైన్ పనులు నిర్మించారు. వెదురుపావులూరు సరిహద్దు నుంచి ఆర్వోఆర్ అప్రోచ్ పనులు మొదలయ్యాయి. అప్రోచ్కు అనుసంధానంగా ఆర్వోఆర్ (ఎలివేటెడ్ రైల్వే లైన్) నిర్మాణ పనులు చేపట్టి పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ రైల్వేలైన్ పనులు వెదురుపావులూరు-ముస్తాబాద పరిధిలో జరుగుతున్నాయి. గుణదల సరిహద్దు, వెదురుపావులూరు నుంచి పొలాల మీదుగా రైల్వే పట్టాలను క్రాస్ చేస్తూ ముస్తాబాద దగ్గర రైల్వేట్రాక్కు ఈ ఆర్వోఆర్ అనుసంధానమవుతుంది. ఇది ‘ఎస్’ ఆకారంలో రూపుదిద్దుకుంటోంది. ఆరు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయి. ఈ రైల్ మార్గం మొత్తం 219 కిలోమీటర్లు ఉంటుంది. రూ.1,952 కోట్లతో నిర్మిస్తున్న ఈ మార్గం తెలంగాణాలో 184 కిలోమీటర్లు, ఏపీలో 35 కిలోమీటర్లు ఉంది. ఏపీలో చెరువు మాధవరం నుంచి న్యూ వెస్ట్ బ్లాక్ హాట్ క్యాబిన్ వరకు 16.7 కిలోమీటర్ల మేర మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో భాగంగా కొంతమేర లైన్, మరికొంత మేర రెండు ఆర్వోఆర్లను పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి రాయనపాడు మార్గంలో నిర్మిస్తున్న ఆర్వోఆర్ పనుల్లో ఆశించినంత పురోగతిలో లేదు.