ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:38 AM
యువత ఆరోగ్యవంతమైన జీవితం గడిపితేనే బంగారు భవిష్యత ఉంటుందని జిల్లా ఈగల్ విభాగం అధికారి ఎం.వీరాంజనేయులు తెలిపారు.
ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టండి
యువతకు జిల్లా ఈగల్ విభాగం అధికారి వీరాంజనేయులు పిలుపు
గుణదల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): యువత ఆరోగ్యవంతమైన జీవితం గడిపితేనే బంగారు భవిష్యత ఉంటుందని జిల్లా ఈగల్ విభాగం అధికారి ఎం.వీరాంజనేయులు తెలిపారు. యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల దుర్వినియోగంపై గురువారం కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు యువత భవిష్యతను అంధకారం చేస్తాయన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. ర్యాగింగ్ వంటి సామాజిక వ్యాధిని తరిమికొట్టడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్ను ప్రోత్సహించే యాజమాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆచంట సునీత మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగం, ర్యాగింగ్ అనే పదం జిల్లాలో వినపడకుండా చేయాలనే లక్ష్యంతో తాము అనేక కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఈగల్ విభాగం నుంచి పి.రాంబాబు, మాచవరం ఎస్ఐ జి.శంకర్రావు, కళాశాల యాంటి ర్యాగింగ్ కమిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.రమణ తదితరులు పాల్గొన్నారు.