రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - May 23 , 2025 | 01:38 AM
ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని డీలర్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ అందించండి
డీలర్లకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం
కలెక్టరేట్, మే 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని డీలర్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీపై గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌర సరఫరాల అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లు, డీలర్ల అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేషన్ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సేవలందించాలన్నారు. ప్రజాప్రతినిధులు రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ-పోస్, వెయింగ్ మెషీన్ల రిపేర్లకు సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్వో ఎ.పాపారావు, ఏఎస్వోలు చల్లా లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్.లక్ష్మణబాబు, డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎం.వెంకటరావు, జిల్లా ప్రెసిడెంట్ యు.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, జిల్లా ట్రెజరర్ ఎం.భూషణం, పౌరసరఫరాల డీటీలు, ఆర్ఐలు పాల్గొన్నారు.