ఆదాయానికి మైనస్
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:44 AM
రిజిసే్ట్రషన్ శాఖలో కార్డ్ ప్రైమ్-2.0 సాఫ్ట్వేర్లో మైనస్ నెంబర్లు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందల సంఖ్యలో రిజిసే్ట్రషన్లు ఆగిపోగా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
రిజిసే్ట్రషన్ శాఖలో మైనస్ నెంబర్ల తంటా
కార్డ్ ప్రైమ్ 2.0లో మైనస్ నెంబర్ల రిజిస్ర్టేషన్లకు నో ఆప్షన్
సీలింగ్ భూములకు సంబంధించి భారీగా ఇబ్బందులు
రిజిస్ర్టేషన్లు జరగక తలలు పట్టుకుంటున్న యజమానులు
కోర్టు వివాదాలతో కూడిన ఆస్తులకూ ఇవే అవస్థలు
పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి కూడా..
‘మైనస్’ కారణంగా గిఫ్ట్ డీడ్స్, రిజిస్ర్టేషన్లకు అవకాశం లే ని పరిస్థితి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో పూర్వ కోర్టు వివాదాలు, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తనఖాలు పెట్టినవారు మైనస్ నెంబర్ల సమస్యలతో అల్లాడుతున్నారు. రిజిస్ర్టేషన్లు జరగకపోవడంతో అవన్నీ నిరర్థక ఆస్తులుగా ఉండిపోతున్నాయి. బ్యాంకుల్లో తనఖా పెట్టి విద్య, గృహ రుణాలు పొందటానికి కానీ, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వాటికి సంబంధించిన అవసరాలకు కానీ అవి ఉపయోగపడట్లేదు.
మైనస్ నెంబర్లు అంటే..
అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల ఆక్రమణలు, తదనంతర ం పట్టాలు ఇచ్చినా.. వివాదాల నేపథ్యంలో కోర్టులే రిజిస్ర్టేషన్లు నిర్వహించినపుడు మైనస్ నెంబర్లు ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మఽధ్య భూ, ఆస్తి గొడవలు వచ్చి న్యాయస్థానాలకు చేరితే న్యాయమూర్తులు ఎవరి ఆస్తులను వారికి నిర్దేశించే క్రమంలో కోర్టు ద్వారా రిజిస్ర్టేషన్లు చేస్తారు. అలాంటి వాటికి రిజిస్ర్టేషన్లు జరిగినా మైనస్ నెంబర్లు ఉంటాయి. అలాగే, పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తమ భూములను హామీగా పెట్టి రుణాలు తీసుకున్నపుడు ఇప్పటిలా మార్ట్గేజ్ కాకుండా రుణాలు ఇచ్చేవి. కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒక పత్రాన్ని ఇచ్చేవి. ఆ పత్రాన్ని రిజిస్ర్టేషన్ శాఖలో ఇచ్చేవారు. అలాంటపుడు కూడా రిజిస్ర్టేషన్ శాఖలో వాటికి సంబంధించి మైనస్ నెంబర్లు కేటాయించేవారు. ఈ మైనస్ నెంబర్లు ఇవ్వటం ద్వారా ఆ ఆస్తులను మరొకరికి విక్ర యించటానికి కానీ, మార్ట్గేజ్ పెట్టడానికి కానీ చెల్లుబాటు కాదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఇతర శాఖలు, అధికార సంస్థల నుంచి అభ్యంతరాలు లేని వాటికి మినహాయింపు ఇచ్చారు.
నగరంలో యూఎల్సీ మిగులు భూముల బాధితులు
పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్) మేరకు మిగులు భూముల్లో ఆక్రమణలు, తదనంతరం వాటికి పట్టాలు ఇవ్వటం, చేతులు మారటం వంటివి నగరంలో జరిగాయి. ఈ క్రమంలో కొన్నింటికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం పూర్వం జీవో ఇచ్చింది. అలాంటి వాటికి సంబంధించిన వాటిలో కొన్నింటికి పూర్వం మాన్యువల్గా ఉన్నప్పుడు రిజిస్ర్టేషన్లు చేశారు. కంప్యూటరీకరణ ప్రారంభమయ్యాక కూడా కొంతకాలం రిజిస్ర్టేషన్లు జరిగాయి. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ వచ్చినప్పటి నుంచి కూడా అవి మైనస్ నెంబర్లుగా ఉంటున్నాయి. ప్రస్తుత కార్ట్ ప్రైమ్ 2.0 వెర్షన్లో కూడా ఈ మైనస్ నెంబర్లకు రిజిస్ర్టేషన్లు జరగట్లేదు. నగరంలో ఇలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు.
ఆప్షన్లు కల్పించాలి
ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యాయ సంబంధిత వివాదాలు, కో ఆపరేటివ్ బ్యాంకు తనఖా రుణాలకు సంబంధించిన వాటికే ఇప్పటికీ మైనస్ నెంబర్లుగా ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ర్టేషన్లు చేయాలంటే కుదరట్లేదు. మైనస్ నెంబర్లు ఉన్నవాటికి కూడా రిజిస్ర్టేషన్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. కార్డ్ ప్రైమ్ 2.0లో అవకాశం కల్పిస్తే ఎంతోమందికి న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే ఎల్పీ నెంబర్ల కారణంగా సబ్ డివిజన్లు జరగక చాలా రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. ఆదాయం కూడా తగ్గింది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.