వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటే: రామ్మోహన్
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:22 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీరు మార్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటే లభిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
శ్రీకాకుళం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీరు మార్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటే లభిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ఐదేళ్లు జగన్మోహన్రెడ్డి తీరని ద్రోహం చేశారు. ఆ బాధ భరించలేక కేవలం 11 సీట్లు ఆయనకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడమే పనిగా జగన్ పెట్టుకున్నాడు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ఐదేళ్ల కాలంలో జగన్ చేయలేని పనులను సైతం కూటమి ప్రభుత్వం చేయడంతో వైసీపీ మరింత పతనమైంది’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.