పాఠశాల విద్యలో అసంబద్ధ విధానాలు వద్దు
ABN , Publish Date - May 05 , 2025 | 11:44 PM
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో తెస్తున్న అసంబద్ధ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు టౌన్, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో తెస్తున్న అసంబద్ధ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో పాఠశాల విద్యావ్యవస్థ నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఒక్కో పాఠశాలకు ఒక్కో రకమైన విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1 నుంచి 5 తరగతి వరకు మోడల్ ప్రాథమిక లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాల కొనసాగించాలని ఆ పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7 తరగతులు ఉన్నచోట నలుగురు స్కూల్ అసిస్టెంట్లను, 6, 7, 8 తరగతులు ఉన్నచోట ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 9న జిల్లా కేంద్రాల్లో, 14న విజయవాడలో ధర్నాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, రమేష్రెడ్డి, మునివర్ధన్కుమార్, కుళాయిరెడ్డి, కృష్ణారెడ్డి, అప్సర్పాషా, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, సయ్యద్బాష, ఈశ్వర్రెడ్డి, కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.