Share News

కబ్జా గ్యాంగ్‌!

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:14 AM

ఒకరు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించడంలో దిట్ట.. మరొకరిది నకిలీ పత్రాలు సృష్టించడంలో అందివేసిన చేయి.. ఇంకొకరు ఎనీవేర్‌ విధానంలో ప్రభుత్వ భూమిని ఏ జిల్లాలో అయినా రిజిసే్ట్రషన్‌ చేయించడంలో నిష్ణాతుడు.. వేరొకరు కబ్జా చేసిన భూములకు బేరాలు తెచ్చి అమ్మేయడంలో ఘటికుడు. వీరందరూ కలసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. విజయవాడ నగర శివారులోని కండ్రిక కాలనీకి ఓ ప్రైవేట్‌ వెంచర్‌కు మధ్యలో ఉన్న రూ. 10 కోట్ల విలువైన కార్పొరేషన్‌ భూములను కబ్జా చేశారు. ప్లాట్లు వేసి మరీ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

కబ్జా గ్యాంగ్‌!

- రూ.10 కోట్ల విలువైన కార్పొరేషన్‌ స్థలం ఆక్రమణ

- తహసీల్దార్‌ చర్యలు తీసుకున్న ఇరవై రోజులకే మళ్లీ పాగా

- టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తొలగించిన సరిహద్దు రాళ్లు తొలగి ఏర్పాటు

- తహసీల్దార్‌ కలెక్టర్‌కు లేఖ రాసినా భయపడని కబ్జా గ్యాంగ్‌

- ఎనీవేర్‌ విఽధానంతో మైలవరంలో ప్రభుత్వ భూమికి రిజిసే్ట్రషన్లు

- చోద్యం చూస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

ఒకరు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించడంలో దిట్ట.. మరొకరిది నకిలీ పత్రాలు సృష్టించడంలో అందివేసిన చేయి.. ఇంకొకరు ఎనీవేర్‌ విధానంలో ప్రభుత్వ భూమిని ఏ జిల్లాలో అయినా రిజిసే్ట్రషన్‌ చేయించడంలో నిష్ణాతుడు.. వేరొకరు కబ్జా చేసిన భూములకు బేరాలు తెచ్చి అమ్మేయడంలో ఘటికుడు. వీరందరూ కలసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. విజయవాడ నగర శివారులోని కండ్రిక కాలనీకి ఓ ప్రైవేట్‌ వెంచర్‌కు మధ్యలో ఉన్న రూ. 10 కోట్ల విలువైన కార్పొరేషన్‌ భూములను కబ్జా చేశారు. ప్లాట్లు వేసి మరీ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ రూరల్‌/పాయకాపురం)

పాయకాపురం కండ్రిక కాలనీ శివారులోని డీమార్ట్‌ సమీపంలో ఆంధ్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇండసి్ట్రయల్‌ వర్కర్స్‌ హౌస్‌ సొసైటీ లిమిటెడ్‌ వెంచర్‌ ఉంది. సొసైటీ వెంచర్‌కు, కండ్రిక కాలనీకి మధ్య సర్వే నంబర్‌ 63/1లో సుమారు 4000 గజాల కార్పొరేషన్‌ స్థలం ఉంది. సొసైటీ వెంచర్‌ సర్వే నంబరు 60/2లో ఉంది. సదరు సొసైటీ డాక్యుమెంట్ల ఆధారంగా పక్కనే ఉన్న సర్వే నంబరు 63/1బీలో ఉన్న కార్పొరేషన్‌ స్థలంపై ఓ వ్యక్తి కన్నేశాడు. సొసైటీ భూములు ఉన్న 60/2 సర్వే నంబరు, డాక్యుమెంట్లు ఆధారంగా కార్పొరేషన్‌ స్థలానికి అదే సర్వే నంబరుతో నకిలీ డాక్యుమెంట్లు పుట్టించాడు. నకిలీ డాక్యుమెంట్లు పుట్టించిన అనంతరం ప్రభుత్వ భూముల కబ్జాల్లో ఆరితేరిన గ్యాంగ్‌లను కలుపుకున్నాడు. అంతా కలసి పక్కా ప్రణాళిక ప్రకారం కార్పొరేషన్‌ స్థలంలో సరిహద్దు రాళ్లు పాతి ఒక్కొక్క ప్లాటును 100 నుంచి 110 గజాలుగా విభజించి మొత్తం 36 ప్లాట్లు వేశారు.

మైలవరంలో రిజిసే్ట్రషన్లు

ఎనీవేర్‌ రిజిసే్ట్రషన్‌ విధానాన్ని కబ్జా గ్యాంగ్‌ ఇక్కడ వాడుకుంది. నకిలీ డాక్యుమెంట్లను పుట్టించి మైలవరం రిజిసే్ట్రషన్‌ కార్యాలయంలో రిజిసే్ట్రషన్‌ చేయించేశారు. అనంతరం సదరు స్థలాలను కొందరు అమాయకులకు అమ్మేసినట్లు కూడా తెలుస్తోంది. ఎనీవేర్‌ విధానం ద్వారా ఒక చోట భూమికి మరొక చోట రిజిసే్ట్రషన్‌ చేయాలంటే అధికారులు ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది. కాని ఇక్కడ ప్రభుత్వ భూమికి మైలవరంలో రిజిసే్ట్రషన్‌ చేయించుకునే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఎన్‌వోసీ ఇచ్చినట్లు సమాచారం.

తహసీల్దార్‌ చర్యలు తీసుకున్న 20 రోజులకే..

ఇదే ప్రభుత్వ స్థలాన్ని గత 20 రోజుల కిందట కబ్జా చేసేందుకు ఈ గ్యాంగ్‌ సరిహద్దు రాళ్లు వేసిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన రూరల్‌ తహసీల్దార్‌ సుగుణ కబ్జా జరిగిన స్థలం దగ్గరకు వచ్చి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలసి కార్పొరేషన్‌ స్థలంలో వేసిన సరిహద్దు రాళ్లను తొలగించివేశారు. ఆ సందర్భంలో సదరు స్థలం కార్పొరేషన్‌కు చెందినదిగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, తహసీల్దార్‌ కూడా ధ్రువీకరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు తహసీల్దార్‌ లేఖ కూడా రాశారు. అలాగే సదరు స్థలానికి ఫెన్సింగ్‌ వేయించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు సూచించారు. అధికారులు వెళ్లిపోగానే మళ్లీ కబ్జా గ్యాంగ్‌ రంగంలోకి దిగింది. కూలీలను పెట్టి మరీ తొలగించిన చోట మళ్లీ రాళ్లను పాతించి కబ్జా చేసింది.

కఠిన చర్యలు లేకపోవడం వల్లనే...

చాలా కాలంగా నగర శివారుల్లోని ఇరిగేషన్‌, కార్పొరేషన్‌, బుడమేరు సరిహద్దు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. సర్వే నంబర్లు మార్చి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి ఎనీవేర్‌ విధానం ద్వారానో లేక అధికారుల చేతులు తడిపో కబ్జాకోరులు ప్రభుత్వ స్థలాలను రిజిసే్ట్రషన్లు చేయించుకుని అమ్మేస్తున్నారు. కబ్జాదారులపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కబ్జాదారులపై కఠిన చర్యల తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్‌ వేసి బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 01:14 AM