Judge Saves Calf: మూగ జీవి రోదన చలించిన న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:33 AM
రోడ్డుప్రమాదంలో గాయపడిన కోడె దూడను చూసి న్యాయమూర్తి రామకృష్ణప్రసాద్ స్పందించారు దూడకు వైద్యం చేయించి, ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటించారు
బైక్ ఢీకొనడంతో కాలు విరిగి కోడెదూడ విలవిల
ఆస్పత్రిలో చేర్పించిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్
గుంటూరు సిటీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): తోటి మనుషులకు ప్రమాదం జరిగినా.. పట్టించుకోకుండా వెళ్లిపోయే ఈ రోజుల్లో.. ఓ మూగ జీవి యెడల కరుణ చూపి, హైకోర్టు న్యాయమూర్తి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి విలవిల్లాడుతున్న కోడె దూడను చూసి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ చలించిపోయారు. గుంటూరులోని ఏటుకూరు బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం కోడె దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కోడె దూడ ఎడమ కాలు విరిగిపోయింది. కుటుంబంతో కలిసి అదే మార్గంలో కారులో వెళ్తున్న జస్టిస్ జి. రామకృష్ణప్రసాద్ ప్రమాదంలో గాయపడిన కోడె దూడను చూసి చలించిపోయారు. ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. దూడకు ప్రాథమిక వైద్యం చేయించి, గుంటూరు పాలీ క్లినిక్కు తరలించారు. అక్కడ డాక్టర్ ఎల్.నాగేశ్వరరావు కోడెదూడకు శస్త్ర చికిత్స చేశారు. క్లినిక్లో ఉన్న దూడను మంగళవారం జస్టిస్ రామకృష్ణప్రసాద్ కుటుంబంతో సహా చూసి, పశుసంవర్థక శాఖ జేడీ నరసింహారావు, డిప్యూటీ డైరెక్టర్ రత్న జ్యోతితో మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. కోడె దూడకు ఆహారం అందించారు. మూగజీవి పట్ల జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ చూపిన వాత్సల్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.