దేవరకు వేళాయే...
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:50 PM
మహాదేవరకు కోసిగి గ్రామం ముస్తాభైంది.

ఐదేళ్ల తర్వాత కోసిగిలో మారెమ్మ ఉత్సవాలు
వేలాదిగా తరలిరానున్న భక్తులు
దేవరకు ముస్తాభైన పొట్టేళ్లు
నేటి నుంచి దేవర ప్రారంభం
కోసిగి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మహాదేవరకు కోసిగి గ్రామం ముస్తాభైంది. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న దేవర సందర్బంగా కోసిగిలోని కింది మారెమ్మ దేవాలయం, ముసలి మారెమ్మ దేవాలయం సిద్దప్ప పాలెం మారెమ్మ దేవాలయం, సుంకులమ్మ దేవాలయం, నాడిగేని గేరి మారెమ్మ దేవాలయం కట్టా, రంగప్పగట్టు మారెమ్మ దేవాలయం, గాంధీనగర్లోని మారెమ్మ, ఒకటోవార్డులోని సుంకులమ్మ ఆలయ కమిటీ పెద్దలు ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుద్ధీపాలంకరణలో మారెమ్మ దేవాలయాలు వెలిగిపోతున్నాయి. బుధవారం నుంచి జరిగే దేవర సందర్బంగా పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. రూ.లక్షలు విలువ చేసే పొట్టేళ్లను దేవర వేడుకల కోసం పోటీ పడి మరీ ప్రజలు ఉత్సవాలకు సిద్ధం చేసుకున్నారు. సిద్దప్పపాలెం మారెమ్మ దేవాలయం, కింది మారెమ్మ దేవాలయం, ముసలి మారెమ్మ దేవాలయాలను పుష్పాలంకరణతో అలంకరించి ఆలయ కమిటి పెద్దలు ముస్తాబు చేశారు. దేవర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.