పండుగ చేసి వలసబాట..
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:03 AM
రెండు రోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్ల ముందు కళకళలాడిన గ్రామాలు..

కోసిగి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్ల ముందు కళకళలాడిన గ్రామాలు.. పండుగ ముగిసిన తర్వాత పిల్లా పాపలతో పెద్దలు వలస బాట పట్టారు. కోసిగి మండలంలోని చింతకుంట, దుద్ది, భోంపల్లి, పల్లెపాడు, ఆర్లబం డ, కామనదొడ్డి, కడిదొడ్డి, వందగల్లు, బెళగల్, ఐరంగల్, కోసిగి తదితర గ్రామాల నుంచి గురువారం సుమారు 500 కుటుంబాలకు పైగా పిల్లా పాపలతో కలిసి కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు కూలీ పనుల కోసం సుగ్గిబాట పట్టారు. దాంతో గ్రామాల్లో ప్రజలు లేక బోసిపోతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో ఉపాధి పనులు తక్కువగా ఉండటం, వలస కుటుంబాల్లో అధిక సంతానం కలిగి ఉండటంతో ఒకరి ఇద్దరికి స్థానికంగా పనులు దొరుకుతుండటం.. మిగతావారు వారిపైనే ఆధారపడి ఉండటం వల్ల కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకకు మిరప, పత్తి పంటల్లో కూలీ పనుల కోసం గురువారం ప్రత్యేక వాహనాలతో పాటు అలాగే రైళ్లలోనూ వలస కూలీలు తమ పిల్లలను వెంట పెట్టుకుని వలసబాట పట్టారు.