SSC exams: పదో తరగతిలో దిద్దుపాట్లు
ABN , Publish Date - May 29 , 2025 | 04:13 AM
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో గురువుల తొందర వల్ల విద్యార్థులు అనేక మార్కులు కోల్పోయారు. ఈ పొరపాట్లపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
కడపలో ఓ విద్యార్థినికి సోషల్లో 21 మార్కులు వేశారు. పునఃమూల్యాంకనంలో 84 మార్కులు రావడంతో మూల్యాంకనంలో తప్పు బయటపడింది. బాపట్ల జిల్లాలో ఓ విద్యార్థినికి సోషల్లో 23 మార్కులే వచ్చాయి. పునఃమూల్యాంకనం చేయిస్తే ఏకంగా 96 వచ్చాయి. దీంతో గురువుల నిర్లక్ష్యం వెలుగు చూసింది.
జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్య వైఖరి
హడావుడిగా దిద్దేసిన గురువులు
ఫలితంగా మార్కుల్లో భారీ తేడాలు
పునఃమూల్యాంకనంతో వెలుగులోకి
రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు 66,363 దరఖాస్తులు
11 వేల పేపర్లలో మారిన ‘ఫలితం’
సీఎం అసంతృప్తి.. తీవ్ర స్పందన
ఐదుగురు బాధ్యులపై సస్పెన్షన్ వేటు
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో గురువుల తొందర.. విద్యార్థులకు శాపంగా మారింది!. మూల్యాంకనాన్ని తొందరగా పూర్తి చేసేయాలన్న ఉద్దేశంతో జవాబు పత్రాలను సంపూర్ణంగా పరిశీలించకుండానే ఎడా పెడా దిద్దేయడంతో విద్యార్థులు మార్కులు కోల్పోయారు. దీనిపై అనుమానం వచ్చిన వేలాది మంది విద్యార్థులు పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోగా.. ఉపాధ్యాయులు చేసిన తప్పులు వెలుగు చూశాయి. మొత్తం గా జవాబు పత్రాల పునఃమూల్యాంకనం, పునఃపరిశీలనకు 66,363 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 11 వేల మంది పేపర్లలో మార్కులు మారాయి. పేపరును దిద్దిన తర్వాత 4 విభాగాలుగా మార్కులు వేస్తా రు. అందులో కొన్నింటిని కౌం టింగ్లోకి తీసుకోకపోవడం వ ల్లే తేడా జరిగిందంటున్నారు.
మూడంచెల్లో..: విద్యార్థుల జవాబుపత్రాలను ఇతర జిల్లాలకు పంపుతారు. ఒక్కో టీచర్ రోజుకు కనీసం 40 పేపర్లు దిద్దాలి. ప్రతి ముగ్గురు మూల్యాంకనం చేసే టీచర్లకు ఒక చెకింగ్ టీచర్ ఉంటారు. ఆ టీచర్ దిద్దిన పేపర్లలో మొత్తం మార్కుల లెక్కింపు, ఏవైనా సమాధానాలకు మార్కులు వేయలేదా? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ మొదటి టీచర్ పొరపాటు చేసినా చెకింగ్లో ఖచ్చితంగా పొరపాటు బయటపడాలి. ఆ తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడు పేపర్లను పరిశీలిస్తారు. ఇలా మూడంచెల్లో ప్రక్రియ జరుగుతుంది.

రికార్డు.. తొందర!: ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరుతో టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జూన్లో జరుగుతాయి. ఈ ఏడాది మాత్రమే ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ముందుకు జరిపారు. అయినా విద్యార్థులు జూన్లో కాలేజీల్లో చేరొచ్చు. అలాంటప్పుడు టెన్త్ ఫలితాలను హడావుడిగా ఎందుకు విడుదల చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘రికార్డు సమయంలో ఫలితాలు ఇచ్చాం.‘ అని చెప్పుకోవడం కోసమే ఇలా చేస్తున్నారు.
తీవ్రంగా పరిగణించాలి: సీఎం
టెన్త్ మూల్యాంకనంలో పొరపాట్లపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘మహానాడు’లో ఉన్న ఆయన దీనిపై ఆరా తీశారు. మార్కుల్లో వ్యత్యాసం రావడం తీవ్ర తప్పిదంగా పరిగణించాలన్నారు. బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఐదుగురు అసిస్టెం ట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. వీరిలో అన్నమయ్య జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు ఉన్నారు. కాగా, దీనిపై పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి వివరణ ఇచ్చారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ జూన్ 1 నాటికి పూర్తవుతుందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి జూన్ 2, 3 తేదీల్లో అవకాశం కల్పిస్తారని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యార్థినికి హిందీలో 49 మార్కులే వచ్చాయి. పునఃమూల్యాంకనం చేయించినా మార్పులు లేవని తేల్చారు. అయితే, పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్నవారికి జవాబు పత్రం పీడీఎఫ్ కాపీ ఇస్తారు. దానిని ఇద్దరు టీచర్లకు చూపించగా కనీసం మరో 40 మార్కులు వస్తాయని తెలిపారు. జవాబుపత్రంలో ఆరు పేజీలకు అసలు ఎలాంటి మార్కులు వేయకుండా కొట్టివేశారు. అవే జవాబులను ఇతర టీచర్లు పరిశీలించి సరైన సమాధానాలే రాసినట్లు చెబుతున్నారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News