Reliance Industries: రిలయన్స్ సీబీజీ ప్లాంట్లకు సహకారం: గొట్టిపాటి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:57 AM
ఆ ప్లాంట్ల నిర్మాణం, ప్రారంభానికి కార్యాచరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రిలయన్స్ ప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమావేశమయ్యారు.

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆ ప్లాంట్ల నిర్మాణం, ప్రారంభానికి కార్యాచరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రిలయన్స్ ప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమావేశమయ్యారు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని బంజరు భూముల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రిలయన్స్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి కోరారు. వీటికి సంబంధించి భూకేటాయింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రకాశం, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. కాగా, జగన్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్తు రంగం నిర్వీర్యమైపోయిందని, అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తొమ్మిది నెలల్లోనే విద్యుత్తు రంగాన్ని గాడిన పెట్టామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో విద్యుత్తు రంగంపై ఇంధన సంస్థల అధికారులతో మంత్రి సమీక్షించారు. గతంలో జగన్ ఏపీజెన్కోను నిర్వీర్యం చేసేలా థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి.. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటుకొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.