Share News

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:12 AM

పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌పై దాడి యత్నించిన గోరంట్ల మాధవ్‌, వారిని అడ్డుకున్న పోలీసులపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

  • వారి అదుపులోని చేబ్రోలు కిరణ్‌పై దాడి యత్నం

  • అడ్డుకోబోయిన పోలీసులపైనా వీరంగం

  • వాహనాన్ని వెంబడించిన మాజీ ఎంపీ

  • ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్‌

  • అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు

గుంటూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్‌ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం శివారులో కిరణ్‌ను అరెస్టుచేసి తీసుకొస్తున్న పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్‌ హల్‌చల్‌ సృష్టించారు. ఎట్టకేలకు మాధవ్‌ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి, చేబ్రోలు కిరణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ వెనువెంటనే స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. పోలీసులు వేగంగా రంగంలోకి దిగి కిరణ్‌ను అరెస్టు చేశారు. వాస్తవం ఇది కాగా, కిరణ్‌ను అరెస్టు చేసిన పోలీసుల విధులకు మాజీ ఎంపీ మాధవ్‌ అడ్డుతగలడమే కాకుండా, వారిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతకుముందు, తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌పై దాడికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన పోలీసులపైనా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లింది. అయినా, వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్‌ వెంబడించారు.


ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోనూ కిరణ్‌పై దాడికి మరోసారి ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్‌తో పాటు ఆయన అనుచరులు ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకొన్నారు. ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు. అనంతరం అక్కడ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత నల్లపాడు ేస్టషన్‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగీంచడం తోపాటు పోలీసుల అదువులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించడం తదితర సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కిరణ్‌ ను ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయంగానీ, ఏ వాహనంలో తీసుకొస్తున్నారనేది గానీ మాధవ్‌కు ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్‌ అధికారే లీక్‌ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతుంది. గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న గోరంట్ల మాధవ్‌ ఆ తరువాత నేరుగా కిరణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి వెంబడించడం అనుమానాలకు తావిస్తోంది. మాధవ్‌ హడావుడి అంతా వైసీపీ మైండ్‌ గేమ్‌లో భాగమని పోలీస్‌ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్‌ ను కలవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నగరంపాలెం స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే ఆయనను పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో కొద్దిసేపు ఎదురు చూసి తిరిగి వెళ్లిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Updated Date - Apr 11 , 2025 | 04:12 AM