CM Chandrababu AP Development: పెట్టుబడులతో వస్తాం
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:08 AM
ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి రోజు భేటీల్లో
రాష్ట్రంలో గృహనిర్మాణంపై సుర్బానా జురాంగ్ ఆసక్తి
సీఎం చంద్రబాబుతో సంస్థ సీఈవో చెర్ ఎక్లో భేటీ
సింగపూర్ మోడల్ హౌసింగ్ విధానంపై చర్చ
అమరావతి మాస్టర్ప్లాన్ మెరుగుదలపైనా
ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎవర్సెండాయ్ ప్రతిపాదన.. విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు!
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి రోజు భేటీల్లో భాగంగా నిర్మాణ రంగంలో పేరొందిన సుర్బానా జురాంగ్, ఎవర్సెండాయ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం సుర్బానా సంస్థ గ్లోబల్ టౌన్షిప్ సీఈవో చెర్ ఎక్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెద్దఎత్తున గృహనిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం ఆయన్ను ఆహ్వానించారు. ఏపీలో ‘హౌసింగ్ ఫర్ ఆల్’ ప్రాజెక్టులో భాగం కావాలని సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సింగపూర్ మోడల్ హౌసింగ్ విధానం అమలుపై ఇరువురి నడుమ చర్చ జరిగింది.
ఏపీలో.. ముఖ్యంగా అమరావతిలో ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై సుర్బానాతో భాగస్వామ్యం, సహకారంపైనా చర్చించారు. సింగపూర్లో 83 శాతం గృహనిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వమే చేపట్టిందని చెర్ ఎక్లో చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 20 రేవులు, 15 విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తున్నాయని.. ఏపీ లాజిస్టిక్ హబ్గా తయారవుతోందని సీఎం తెలిపారు. ఈ ప్రాంతాలను పారిశ్రామిక టౌన్షిప్పులుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలను సుర్బానా ముందు ఉంచారు. ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై దృష్టి సారించామని, ప్రధానంగా గృహ నిర్మాణ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు చెర్ ఎక్లో సీఎంకు తెలిపారు. తప్పకుండా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. గతంలో రాజధాని అమరావతి కోసం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ను మరింత మెరుగుపరిచే అంశంపైనా ఎక్లోతో సీఎం ఆయనతో చర్చించారు. అమరావతిని భవిష్యత్ నగరంగా మార్చే క్రమంలో ప్రోగ్రాం మేనేజ్మెం ట్ కన్సల్టెన్సీగా సుర్బానా జురాంగ్ పనిచేయనుంది.
ఎవర్సెండాయ్ ఎండీతో సమావేశం..
మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండాయ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తన్శ్రీ డాటో నాథన్ కూడా సీఎంను కలిశారు. రాష్ట్రంలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతోపాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఏపీలో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నం లేదా కృష్ణపట్నంలో నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నాథన్ తెలిపారు. సుమారు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. అటు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని చెప్పారు. రాష్ట్రంలోని ఐఐటీ-తిరుపతి, ఐఐఐటీ-శ్రీసిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనకూ ఆసక్తి వ్యక్తం చేశారు.
ఈ సంస్థల ప్రత్యేకత ఇదీ..?
ఎవర్సెండాయ్..
మలేషియా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను తన్శ్రీ డాటో నాథన్ స్థాపించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చరల్ స్టీల్ టర్న్కీ కాంట్రాక్టు సంస్థగా ఎదిగింది. అత్యంత ఎత్తయిన భవనాల స్టీల్ ఫ్యాబ్రికేషన్లో దీనికి మంచి పేరుంది. బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్-2, చెన్నైలోని డీఎల్ఎఫ్ డౌన్టౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లో ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. ఇది ఇప్పటికే తమిళనాడులోని తిరుచ్చిలో 30 వేల టన్నుల సామర్థ్యంతో ఫ్యాబ్రికేషన్ యూనిట్ నిర్వహిస్తోంది.
సుర్బానా జురాంగ్..
సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పేరొందింది. ఆస్ట్రేలియాలోని స్నోవీ పర్వతాల్లో ఈ సంస్థ నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ స్కీంను ప్రపంచంలోని ఏడు ఇంజనీరింగ్ వింతల్లో ఒకటిగా చెబుతారు. భారత్లోనూ పలు ప్రాజెక్టులకు పని చేసింది. ప్రపంచంలోనే పొడవైన టన్నెల్గా పేరొందిన అటల్ టన్నెల్ డిజైన్ రూపకల్పనలో సుర్బానా భాగస్వామిగా ఉంది. అలా ప్రపంచంలోనే అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్లలో ఒకటైన తమిళనాడులోని పేరూరులో డీశాలినేషన్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ సంస్థకు భాగస్వామ్యం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News