Fog Accident : ఇద్దరిని బలిగొన్న పొగమంచు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:48 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలో సోమవారం తెల్లవారుజామున కాలినడకన వస్తున్న శ్రీవారి భక్తులపైకి 108 అంబులెన్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు

కాలినడక భక్తులపైకి దూసుకెళ్లిన ‘108’
ఒకరి పరిస్థితి విషమం.. మరో నలుగురికి గాయాలు
అదే అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు
చంద్రగిరి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలో సోమవారం తెల్లవారుజామున కాలినడకన వస్తున్న శ్రీవారి భక్తులపైకి 108 అంబులెన్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. పొగమంచు కారణంగా రహదారి సరిగా కనబడకపోవడంతో వాహనం వారిపైకి దూసుకెళ్లినట్లు పోలీసుల సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చంపాలపల్లె, శేగంవారిపల్లెకు చెందిన సుమారు 60 మంది భక్తులు బృందంగా తిరుమలకు కాలినడకన బయలుదేరారు. మరోవైపు.. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన హరికృష్ణకు గుండెపోటు రావడంతో 108 అంబులెన్సులో తిరుపతికి తీసుకొస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భక్తుల బృందం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలో నారాయణ కళాశాల వద్ద మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారిపై నడిచి వస్తున్నారు. అదే సమయంలో మదనపల్లె నుంచి వస్తున్న 108 అంబులెన్సు వారిపైకి దూసుకెళ్లింది. ఏడుగురికి తీవ్రంగాయాలు కావడంతో అదే అంబులెన్సులో తిరుపతిలోని రుయాస్పత్రికి తరలించారు. అప్పటికే పెద్దరెడ్డమ్మ(40), లక్ష్మమ్మ (50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తులసమ్మ(42), రమేష్, చిన్నరెడ్డమ్మ, రెడ్డమ్మ, యశోదమ్మ తీవ్ర గాయాలయ్యాయి. తులసమ్మ పరిస్థితి విషమంగా ఉంది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.