AP Road Mishaps: ఉమ్మడి కృష్ణాలో ఐదు రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:24 AM
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కరోజే జరిగిన ఐదు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ఘటనల్లో కార్లు, లారీలు, బైక్లు మృత్యుఫలకంగా మారాయిఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కరోజే జరిగిన ఐదు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ఘటనల్లో కార్లు, లారీలు, బైక్లు మృత్యుఫలకంగా మారాయి
ఎనిమిది మంది దుర్మరణం
విజయవాడ, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన ఐదు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం నుంచి ఫ్లైయాష్ లోడ్తో గన్నవరం వైపునకు వెళ్తున్న లారీ డ్రైవర్ రామకృష్ణకు ప్రసాదంపాడు వచ్చేసరికి గుండెపోటు రావడంతో వాహనాన్ని నియంత్రణ కోల్పోయాడు. లారీ ఫుట్పాత్ను ఢీకొట్టి, ఫుట్పాత్ ఎక్కడంతో పాదచారుడు రామసాయి చనిపోయాడు. గుండెపోటుతో రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన పసుమర్తి భాస్కరరావు (48), రుద్రపోగు వెంకటేశ్వర్లు (39) ఏసుక్రీస్తు మాల వేసుకుని శ్రమదీక్ష ప్రారంభించారు.
దీక్ష విరమించడానికి గుణదలకు వస్తుండగా అనాసాగరం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పామర్రుకు చెందిన భవన నిర్మాణ రంగ కార్మికుడు ఆరేపల్లి శ్రీనివాసరావు(58) గుడివాడకు మోటారు సైకిల్పై వెళ్తూ రోడ్డు డివైడర్ను ఢీకొట్టి చనిపోయాడు. హనుమాన్ జంక్షన్కు చెందిన షేక్ బాబాసాహెబ్(51)ను సర్వీసు రోడ్డులో కారు ఢీ కొట్టడంతో మరణించాడు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు, ప్రవీణ్కుమార్ కారులో విజయవాడ వస్తూ జగ్గయ్యపేటలో జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రవీణ్ దుర్మరణం చెందాడు.