Farmers Welfare: అన్నదాతకు మద్దతు
ABN , Publish Date - May 29 , 2025 | 04:58 AM
ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచుతూ 14 రకాల పంటలకు లాభదాయక ధరలు ప్రకటించింది. రైతులకు కేసీసీ రుణ పథకం కొనసాగింపుతో పాటు రెండు రైల్వే ప్రాజెక్టులకు అనుమతి మంజూరైంది.
వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
ధాన్యానికి రూ.69, పెసలుకు 86,
పత్తికి 589, ఆవాలకు 820 పెంపు
ఖరీఫ్ సీజన్ నుంచే అమలు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
ఖర్చుకు, మద్దతుకు పొంతనే లేదు: రైతు సంఘాలు
అమరావతి/న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను(ఎంఎ్సపీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా మొత్తం 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. వరికి 3 శాతం, పప్పుధాన్యాలు 5.96 శాతం, నూనె గింజలకు 9 శాతం చొప్పున ఎంఎ్సపీ పెరగనుంది. పెంచిన ధరలు 2025-26 ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎంఎ్సపీ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఖరీఫ్ పంటల సాగు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో మద్దతు ధరలపై దృష్టి పెట్టినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం.. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపుతోపాటు స్వల్పకాలిక వడ్డీ రుణ పథకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సాధారణ, ఏ-గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.69 చొప్పున పెంచినట్టు తెలిపారు. ఇక, క్వింటా ఆవాలుకు రూ.820, రాగులకు రూ.596, నువ్వులకు రూ.579 పెంచినట్టు చెప్పారు. కౌలు, ఎరువులు, విత్తనాలు, పంట కోత, రవాణా, వృథా, ఇంధనం, కూలి ఖర్చులన్నీ లెక్క కట్టి, కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సగటు ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి, రైతులకు లాభదాయకంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించామన్నారు.
రుణ సదుపాయం కొనసాగింపు
రైతులకు స్వల్పకాలిక సరసమైన వడ్డీ రుణ పథకాన్ని 2025-26లోనూ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)లు ఉన్న రైతులకు సవరించిన స్వల్పకాలిక రుణాలను అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.5 శాతం వడ్డీ రుణాలను యథాతథంగా కొనసాగించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకాన్ని కొనసాగించడం వల్ల ఖజానాపై రూ.15,640 కోట్ల భారం పడుతుందని చెప్పారు. కేసీసీ ఉన్న రైతులు గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చని తెలిపారు. కాగా, దేశంలో 7.75 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
మద్దతు ధరల పెంపుపై మంత్రి అచ్చెన్న హర్షం
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ పంటల మద్దతు ధరలను కేంద్రప్రభుత్వం పెంచడం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్.. రైతులు లాభదాయ ధరలు పొందటానికి వీలుగా మద్దతు ధరలను నిర్ణయించిందని ఓ ప్రకటనలో తెలిపారు. మద్దతు ధరలు పెంచడం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందే విస్తరించడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావచ్చన్నారు. గత ఐదేళ్లు వ్యవసాయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు త్వరలో అన్నదాత సుఖీభవ కింద సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రైతులకు వ్యక్తిగత పరికరాలు అందిస్తున్న ప్రభుత్వం రానున్న కాలంలో సాంకేతికంగా మరింత ఊతమిస్తుందని తెలిపారు.
2 రైలు ప్రాజెక్టులకు అనుమతి
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలోని రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రత్లాం-నాగ్దా, వార్ధా-బల్లార్షాల మధ్య నాలుగో లైన్(176 కిలో మీటర్లు)ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా మరింత వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ.3,399 కోట్లను ఖర్చు చేయనున్నామని, 2029-30 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News