Liquor Scam Accused Behrun Shazil Sheikh: నా ఫ్లాట్లో డబ్బు దాచేవారు
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:40 AM
ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నా దగ్గర పెట్టిన డబ్బులు తీసుకున్నారు. నన్ను దుబాయ్కి వెళ్లిపొమ్మన్నారు. అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నా. నాకు లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు.
వైసీపీ ఓడిపోగానే తీసుకెళ్లారు.. తర్వాత నన్ను దుబాయ్ పంపారు
రాజ్ కసిరెడ్డి ఈవీ డిజైన్ కోసం ఇంజనీర్గా పనిచేశా
లిక్కర్ స్కామ్ గురించి తెలీదు.. సిట్ విచారణలో ఏ-47 బెహ్రూన్ షాజిల్షేక్
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నా దగ్గర పెట్టిన డబ్బులు తీసుకున్నారు. నన్ను దుబాయ్కి వెళ్లిపొమ్మన్నారు. అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నా. నాకు లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు. రాజ్ కసిరెడ్డి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ఎలక్ర్టిక్ వాహన డిజైన్లో పనిచేసిన ఇంజనీర్ను మాత్రమే’ అని సిట్ అధికారులకు లిక్కర్ స్కామ్ నిందితుడు బెహ్రూన్ షాజిల్ షేక్(ఏ-47) చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(ఏ-1) ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకుల్లో షాజిల్ షేక్ ఒకడు. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ కంట్లో పడ్డాడు. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన కమీషన్ల నుంచి రాజ్ కసిరెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. మరోవైపు మనదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐప్యాక్ బృందంలోని కీలక వ్యక్తి భార్యను సీఈవోగా నియమించి ఈవీ బ్యాటరీ, వాహన డిజైన్తో పాటు కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ అనుమతులన్నీ పొందాడు. అందుకు భారీగా సొమ్ము ఖర్చు చేసిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ ముడుపుల నుంచి నగదు రూపంలో ఎప్పటికప్పుడు ఈవీ వాహన ఆర్ అండ్ డీ కోసం వినియోగించాడు.
డిజైన్ రూపకల్పనలో ఇంజనీర్గా పనిచేసిన బెహ్రూన్ షాజిల్ ఎన్నికల ముందు వరకూ హైదరాబాద్లో ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉండటంతో రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ సభ్యులు లిక్కర్ ముడుపులను అప్పుడప్పుడు అట్ట పెట్టెల్లో తెచ్చి బెహ్రూన్ ఫ్లాట్లో పెట్టేవారు. ఈవీ అవసరాల కోసం కొంత ఇచ్చి, మిగతా సొమ్ము తీసుకెళ్లేవారు. సిట్ అధునాతన టెక్నాలజీ సాయం తో మొత్తం మూలాలు వెలికి తీస్తోంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్లోని బెహ్రూన్ ఫ్లాట్కు వెళ్లినట్లు విచారణలో గుర్తించింది. కూపీ లాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచే వారని తేలింది. దీంతో బెహ్రూన్ షేక్ను లిక్కర్ స్కామ్లో నిందితుడిగా చేర్చింది. సిట్ అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. దుబాయ్లో ఉంటున్నట్లు తెలుసుకుని విచారణకు రమ్మని పిలవడంతో శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చాడు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజ్ కసిరెడ్డి ఈవీ వాహనం కోసమే పని చేశానని చెప్పిన బెహ్రూన్ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న సిట్ అధికారులు తమకు అందుబాటులో ఉండాలని చెప్పి పంపినట్లు సమాచారం. అయితే తన కుటుంబం దుబాయ్లో ఉంటోందని, ఈ స్కామ్లో తాను చిక్కుకుంటానని అనుకోలేదంటూ నిందితుడు వాపోయినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News