మహిళలకు కనుమరుగు
ABN , Publish Date - May 19 , 2025 | 12:48 AM
రాజమహేంద్రవరం నడిబొడ్డున, వై.జంక్షన్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల రైతు బజార్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడి రైతులు, డ్వాక్రా మహిళలు, ఇతర వ్యాపారులకు రైతుబజార్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో కొనుగోలుదారులకు సైతం ఇక్కట్లు తప్పడంలేదు.
ఆర్ట్స్ కళాశాల రైతు బజార్లో కనీస సౌకర్యాలు కరువు
తాగేందుకు నీరుండదు
మూలకు చేరిన ఆర్వో ప్లాంటు
షెల్టర్ లేని ఎస్టేట్ ఆఫీసర్
నిరుపయోగంగా సెంట్రల్ జైలు షాపు
రాజమహేంద్రవరం అర్బన్, మే 18 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం నడిబొడ్డున, వై.జంక్షన్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల రైతు బజార్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడి రైతులు, డ్వాక్రా మహిళలు, ఇతర వ్యాపారులకు రైతుబజార్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో కొనుగోలుదారులకు సైతం ఇక్కట్లు తప్పడంలేదు. ప్రధానంగా మహిళా రైతులు, డ్వాక్రా మహిళలు మరుగు కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికీ చెప్పుకోలేక ఆవేదన దిగమింగుకుంటున్నారు. ఉదయమే రైతుబజార్కు వచ్చి ఒకసారి రైతుబజార్లోని షాపులో కూర్చుంటే మళ్లీ రాత్రికే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పటి వరకూ అన్నీ బంద్ అనే రీతిలో ఇక్కడి పరిస్థితులు ఉన్నాయి. దీంతో మహిళల పరిస్థితి దారుణంగా ఉంటోంది. అలాగే, ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కనీ సం మంచినీళ్ల కుళాయి కూడా లేదు. బోరు ఉన్నా తా గేందుకు పనికిరాదు. దీంతో డ బ్బులు చెల్లించి బ యటి నుంచి వాటర్ టిన్నులు తెచ్చుకుంటున్నారు. గతంలో పేపర్మిల్లు సౌజన్యంతో రైతుబజార్ ఎదుట ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినా దాని నిర్వహణ పట్టించుకోకపోవడంతో మూలనపడింది. శిథిలావస్థకు చేరింది. దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ఆలోచన చేయడంలేదు. రైతుబజార్లో 53 మంది రిజిస్టర్డ్ రైతులు, 11 డ్వాక్రా షాపులు, రెండు కిరాణా, ఇతర వ్యాపారులు ఉంటే వీరిలో అధికశాతం మంది మహిళలే ఉన్నారు.
నిలువ నీడ లేని ఎస్టేట్ ఆఫీసర్
రైతుబజార్ దైనందిన కార్యకలాపాలను పర్యవేక్షించే ఎస్టేట్ ఆఫీసర్కు కనీసం ఆఫీస్రూం కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారుల కోసం కేటాయించిన మూలన ఉన్న ఒక చిన్న ఇరుకు గదిలో కూర్చుని రైతుబజార్ను పర్యవేక్షిస్తుంటారు. గదిలో కూర్చుంటే బయట ఏం జరుగుతుందో కూడా తెలిసే అవకాశం ఉండదు. అంత చిన్నగా గది ఉంటుంది. ఉన్నతాధికారులకు డైలీ రిపోర్టులు పంపాలన్నా, కార్యాలయానికి సంబంధించిన స్టేషనరీ, ఇతర పరికరాలు భద్రపరచాలన్నా ఆ చిన్నగదిలోనే సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎస్టేట్ ఆఫీసర్ కూడా ఇబ్బందులు పడుతూనే విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి ఇక్కడ ఉంది.
తెరుచుకోని సెంట్రల్ జైలు షాపు
ఆర్ట్స్ కళాశాల రైతుబజార్ నిర్మాణ సమయంలో అధికారులు సెంట్రల్ జైలుకు ఒక షాపును కేటాయించారు. కొన్నాళ్లపాటు ఈ షాపులో సెంట్రల్ జైలు ఖైదీలు తయారు చేసిన బిస్కెట్లు, ఇతర తినుబండారాలను విక్రయించారు. కొన్ని నెలల నుంచి ఇక్కడ విక్రయాలు ఆపేసి షట్టర్ మూసేశారు. దీంతో ఇది నిరుపయోగంగా ఉంది. వేరేవాళ్లకు ఇవ్వరు, వాళ్లు వాడుకోరు అన్నట్టుగా ఉంది. ఈ షాపు పరిస్థితి. సమస్యలు ఇక్కడ రాజ్యమేలుతున్నా మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలపై దృష్టిసారించాలని రైతుబజార్లోని రైతులు, వ్యాపారులు, ముఖ్యంగా మహిళా రైతులు వేడుకుంటున్నారు.