Share News

రైలు వెళుతున్నా.. వెళ్లిపోవచ్చు

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:50 AM

రైల్వే లెవెల్‌ క్రాస్‌ గేట్లు ఉండవు. వాటిని పూర్తిగా ఎత్తివేసి వాటి స్థానంలో వాహనాల రద్దీని బట్టి ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాసేజ్‌లు నిర్మిం చనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. దక్షిణ మద్య రైల్వే పరిధిలో మొత్తం 1,075 రైల్వే గేట్లను గుర్తించి వీటిని మొత్తంగా తొలగించేందుకు సన్నద్ధం అవుతు న్నారు.

రైలు వెళుతున్నా.. వెళ్లిపోవచ్చు
రైల్వే గేట్ల నిర్వహణ

  • ఇక రైల్వే గేట్లు ఉండవ్‌

  • భారంగా మారడంతో మూత

  • ఫ్లయ్‌ ఓవర్లు, అండర్‌ పాస్‌లు

  • రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

  • సామర్లకోట సెక్షన్‌లో నిర్మాణాలు

  • రాజమండ్రి టూ హంసవరం

  • భూసేకరణకు ఆదేశాలు

  • తీరనున్న వాహనదారుల ఇక్కట్లు

సామర్లకోట, జూలై 21(ఆంధ్రజ్యోతి): రైల్వే లెవెల్‌ క్రాస్‌ గేట్లు ఉండవు. వాటిని పూర్తిగా ఎత్తివేసి వాటి స్థానంలో వాహనాల రద్దీని బట్టి ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాసేజ్‌లు నిర్మిం చనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. దక్షిణ మద్య రైల్వే పరిధిలో మొత్తం 1,075 రైల్వే గేట్లను గుర్తించి వీటిని మొత్తంగా తొలగించేందుకు సన్నద్ధం అవుతు న్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో విజయవాడ నుంచి దువ్వాడ వరకూ మొత్తం 198 రైల్వే గేట్లను గుర్తించారు. వీటి స్థానంలో తాజా ప్రతిపాదనల మేరకు 50 అండర్‌ పాసేజ్‌ల నిర్మాణానికి, 35 ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సామర్లకోట నుంచి కాకినాడ పోర్టు వరకూ మరో ఐదు రైలు గేట్లు తొలగించేందుకు అధికా రులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటి సంఖ్య ఇంకా పెరగనున్నట్టు రైల్వే ఉన్నతాధికారుల ద్వారా సమాచారం. ఈ మేరకు భూసేకరణ చేసి త్వరితగతిన స్థలాలు అప్పగించాలని జిల్లా కలెక్టరేట్‌కు ఆదేశాలు అందాయి. దీంతో సామ ర్లకోట రైల్వే ఇంజనీరింగ్‌ సెక్షన్‌ పరిధిలో రాజ మహేంద్రవరం నుంచి హంసవరం వరకూ భూసేకరణలకు శ్రీకారం చుట్టారు. రైల్వే గేట్ల నిర్వహణ రైల్వే శాఖకు భారంగా మారింది. రైళ్ళు రాకపోకలు సాగించే సమయంలో గేట్లు వేయడంతో గంటల కొద్దీ సమయం వృఽథాతో పాటు సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు ఎక్కువ.ఈ భారాన్ని తగ్గించుకోవడానికి లెవెల్‌ క్రాస్‌ గేట్లు పూర్తిగా ఎత్తివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

  • ఎక్కడెక్కడ ఫ్లయ్‌ ఓవర్లు

సామర్లకోట ఐదు తూముల సమీపాన ఉం డూరు రోడ్డు నుంచి మునిసిపల్‌ కార్యాలయం వరకూ సుమారు కిలోమీటర్‌ పొడవునా 12 మీటర్ల వెడల్పున ఫ్లయ్‌ ఓవర్‌ బిడ్జి నిర్మించ నున్నారు.విజయవాడ-విశాఖ మెయిన్‌ లైన్‌ లోని రెండు ట్రాక్‌లు, సామర్లకోట-కాకినాడ బ్రాంచిలైన్‌లో రెండు ట్రాక్‌లతో పాటు ఏలేరు కాలువ, పీబీసీ కాలువ మీదుగా రూ.100 కోట్ల వ్యయంతో ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించనున్నా రు. జి.మేడపాడు సమీపాన కెనాల్‌ రోడ్డులో శ్మశాన వాటిక నుంచి జి.మేడపాడు రైల్వే స్టేషన్‌ మీదుగా గోలివారి కొత్తూరు కూడలి ప్రాంతం వరకూ మరో ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిని రూ. 100 కోట్లతో నిర్మించనున్నారు. ఇది కూడా 12 మీటర్ల వెడల్పున ఉండేలా నిర్మించను న్నారు. పెదబ్రహ్మదేవం రైల్వేస్టేషన్‌ సమీపాన ప్రస్తుతం ఉన్న అండర్‌పాసేజ్‌ను మరింత విస్తరించే ప్రక్రియకు రైల్వే ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇక్కడ ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించే వీల్లేకపో వడంతో ఇప్పటికే ఉన్న అండర్‌పాసేజ్‌ను మరింత వెడల్పు చేసి నాలుగు చక్రాల వాహ నాలు సైతం రాకపోకలు సాగించేలా ప్లాన్‌ రూపొందిస్తున్నారు.ఈ మేరకు రైల్వే శాఖ నిధులు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అంచనాలు సమ ర్పించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సైతం ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నట్టు సమాచారం.

  • భూసేకరణకు సంసిద్ధం

ప్రస్తుతం అండర్‌ పాసేజ్‌ నిర్మాణాలకు సం బంధించిన ఫైళ్ళు కాకినాడ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నాయి. రావికంపాడు, అన్నవరం, హంసవరం, తుని తదితర ప్రాం తాలకు చెంది భూసేకరణ చేపట్టేందుకు పెద్దాపురం ఆర్డీవో కార్యాలయానికి ఫైళ్లు చేరుకున్నాయి. దీంతో అధికారులు నవంబరు నాటికి భూసేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించనున్నారు. మొత్తం ప్రక్రియ పూర్త యితే వచ్చే ఏడాది నాటికి లెవెల్‌ క్రాస్‌ గేట్లు లేని వ్యవస్థగా రైల్వే శాఖ మారనుంది.

Updated Date - Jul 22 , 2025 | 01:51 AM