అమలాపురంలో ట్రాఫిక్ మళ్లింపు
ABN , Publish Date - May 14 , 2025 | 12:12 AM
అమలాపురం పట్టణ శివారు ఈదరపల్లి వద్ద కొత్తగా వంతెన నిర్మాణంలో ఉన్న దృష్ట్యా ట్రాఫిక్ను కొన్నిరోజుల పాటు మళ్లించినట్టు ఆర్అండ్బీ ఈఈ బి.రాము తెలిపారు.
అమలాపురం, మే 13(ఆంధ్రజ్యోతి): అమలాపురం పట్టణ శివారు ఈదరపల్లి వద్ద కొత్తగా వంతెన నిర్మాణంలో ఉన్న దృష్ట్యా ట్రాఫిక్ను కొన్నిరోజుల పాటు మళ్లించినట్టు ఆర్అండ్బీ ఈఈ బి.రాము తెలిపారు. అమలాపురం బస్టాండు నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సులు గడియారస్తంభం సెంటర్, కళాశాల రోడ్డు, వై-జంక్షన్, తోటలపాలెం, వాకలగరువు మీదుగా అంబాజీపేట, రావులపాలెం వైపు మళ్లించినట్టు తెలిపారు. అదేవిధంగా రావులపాలెం వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా అదేమార్గంలో రావాల్సిందిగా సూచించారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులు, లారీలు నల్లవంతెన, జనుపల్లె, నేదునూరు, ముక్కామల మీదుగా రావులపాలెం వైపు మళ్లించామని చెప్పారు. బైకులు, ఆటోలు, కార్లు నల్లవంతెన, సావరం బైపాస్రోడ్డు, కొత్తగా నిర్మించిన మట్టివంతెన మీదుగా వెళ్లాల్సిందిగా కోరారు. వంతెన నిర్మాణం దృష్ట్యా ప్రజలు పోలీసులు, అధికారులకు సహకరించాలని ఆర్అండ్బీ ఈఈ రాము విజ్ఞప్తి చేశారు.