Share News

పర్యావరణ హితంగా మెలగాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:11 AM

ప్రతిఒక్కరూ పర్యావరణ హితంగా మెలగాలని, పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. శనివారం పలుచోట్ల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు.

 పర్యావరణ హితంగా మెలగాలి
నన్నయలో జరిగిన ప్లాస్టిక్‌ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న వీసీ ప్రసన్నశ్రీ

  • ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలి

  • నన్నయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

  • పలుచోట్ల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు

దివాన్‌చెరువు, మార్చి15 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ పర్యావరణ హితంగా మెలగాలని, పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. శనివారం పలుచోట్ల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ వర్శిటీలో నిర్వహించిన ప్లాస్టిక్‌ వ్యతిరేక ర్యాలీలో వీసీ మాట్లాడుతూ విద్యార్థులు క్యాంపస్‌ పరిసరాలతో బాటు వసతిగృహాలను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు ప్రాంగణంలోని ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంగణంలోని కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో శ్రీకృష్ణపట్నంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ కిమిడి శ్రీరామ్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతకు కొంత సమయం కేటాయించాలని, ప్లాస్లిక్‌ వస్తువులు వినియోగం నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో బి.శ్రీనివాస్‌, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:11 AM