వేసవిలో కాల్వ పనులు పూర్తిచేయాలి: ఎమ్మెల్యే దేవ
ABN , Publish Date - May 14 , 2025 | 12:08 AM
ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో కాల్వ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.
మలికిపురం, మే 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో కాల్వ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఇంటి వద్ద నీటి సంఘాలు, ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వాకు పదివేల ఎకరాల సాగు విస్తీర్ణం అమలయ్యేలా వీరంతా పనిచేయాలన్నారు. ప్రధాన కాల్వ పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా అవసరమైనచోట నీటిని బయటకు తోడి పనులు పూర్తి చేయాలన్నారు. కాల్వలోకి ఒరిగిన చెట్లను తొలగించాలన్నారు. 14 కాల్వల్లో రూ.64లక్షలతో చేపట్టే పనుల్లో నీటిసంఘాల నాయకులు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఈసారి పూడిక తొలగింపునకు నిధులు మంజూరు కాని కాల్వల్లో మట్టిని రైతులు స్వచ్ఛందంగా తవ్వుకుని తీసుకుపోవడానికి నీటిసంఘాలు డిస్ర్టిబ్యూటరీ కమిటీ పరిధిలో తీర్మానాలు చేయాలన్నారు. ప్రభుత్వం డ్రెయిన్స్ పనులకు మరో రూ.86లక్షలు మంజూరు చేసిందని, వాటితో కూడా పనులు చేస్తారని అన్నారు. సఖినేటిపల్లి మండలంలోని రైతులను ముంపు బారి నుంచి బయట పడవేయడానికి కేశవదాసుపాలెం వద్ద ఉన్న స్ట్రయిట్ కట్ వద్ద ఏపీ ఐడీసీ ద్వారా ముంపునీరు సముద్రంలోని పంపుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయమని డ్రైనేజీ అధికారులకు సూచించారు. తాను మంత్రితో లేదా సంబంధిత చైర్మన్తో మాట్లాడతానన్నారు. కేశవదాసుపాలెంలో రెండు నెలల పాటు ముంపు నీటిని బటయకు తోడితే రైతులకు ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుందన్నారు. సార్వా, దాళ్వా పంటలు పండుతాయన్నారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, డీసీ పినిశెట్టి బుజ్జి, హెడ్వర్క్స్ డీఈఈ శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈఈ నాగేంద్రకుమార్, డ్రైనేజీ డీఈఈ ఆర్.నాగార్జున, ఏఈలు రమేష్, సుందర్సింగ్, మూర్తి, రేష్మ, కిరణ్, నీటిసంఘం అధ్యక్షులు తిరుమల బాబి, యెనుముల సింహాచలం, చాగంటి స్వామి, రాపాక మల్లికార్జునరావు, బాబినాయుడు, సూర్యనారాయణ, నామన నాగభూషణంపాల్గొన్నారు.