Share News

ఆర్‌టీషీ..ఉచితం!

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:36 AM

ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ శుక్రవారం నుంచి స్త్రీ శక్తి పథకం అమలుకు సిద్ధమవుతోంది. స్త్రీలకు పంద్రాగస్టు కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తోంది.

ఆర్‌టీషీ..ఉచితం!

ఇక బస్సెక్కితే మహిళలకు ఫ్రీ

గుర్తింపుకార్డు చూపించాలి

సర్కారు ఆగస్టు 15 కానుక

జిల్లావ్యాప్తంగా 283 బస్‌లు

టిమ్స్‌లో ప్రత్యేక బటన్‌ ఏర్పాటు

నాన్‌స్టాప్‌, ఇంటర్‌ స్టేట్‌లకు నో

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ శుక్రవారం నుంచి స్త్రీ శక్తి పథకం అమలుకు సిద్ధమవుతోంది. స్త్రీలకు పంద్రాగస్టు కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఇక బాలికలు,స్త్రీలు, ట్రాన్స్‌జెండర్లు జీరో ఫేర్‌ టిక్కెట్‌తో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి రావచ్చు.తూర్పుగోదావరి జిల్లాలో పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ పథకం అందుబాటులోకి వస్తుంది. నాన్‌స్టాప్‌ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనడంతో రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు, భద్రాచలం అంతర్‌రాష్ట్ర బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం అనుమతించరు. అల్ర్టా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, స్టార్‌ లైనర్‌, సప్తగిరి,ఏసీ బస్సులతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్‌ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదు.

నేటి సాయంత్రం 5 గంటల నుంచి..

శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వస్తుంది.సీఎం చంద్రబాబు రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభించే సమయంలోనే జిల్లాలోనూ మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లాలోని నాలుగు డిపోల్లో స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సాయంత్రం జరిగే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్‌ ప్రారంభిస్తారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గోకవరం,కొవ్వూరు, నిడదవోలు డిపోల్లో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.

ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం..

జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం నాలుగు డిపోల పరిధిలో అన్ని రకాల బస్సులు కలిపి ఆర్టీసీకి మొత్తం 205 సొంత బస్సులు, 78 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి... 37 ఎక్స్‌ప్రెస్‌లు, 27 అల్ర్టా పల్లెవెలుగు, 167 పల్లెవెలుగు ఉండగా, స్త్రీ శక్తి పథకంలో ఈ బస్సుల్లోనే బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. డిపోల వారీగా చూస్తే రాజమహేంద్రవరం డిపోలో 22 ఎక్స్‌ప్రెస్‌లు, 15 ఆల్ర్టా పల్లెవెలుగు, 64 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. గోకవరం డిపోలో 14 ఎక్స్‌ప్రెస్‌లు, 12 ఆల్ర్టా పల్లెవెలుగు, 30 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కొవ్వూరు డిపోలో ఒక ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంది. 42 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నిడదవోలు డిపోలో కేవలం 31 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి.

జీరో టిక్కెట్‌..

స్త్రీలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు జీరో ఫేర్‌ టిక్కెట్‌ జారీ చేస్తారు. స్త్రీ శక్తి టిక్కెట్లపై తాము ప్రయాణించే దూరానికి టిక్కెట్‌ చార్జీ ఎంతవుతుందో ఆ మొత్తం ముద్రించి ఉంటుంది. దానికింద ప్రభుత్వ రాయితీ అంతే మొత్తాన్ని పేర్కొంటారు. చివరన టిక్కెట్‌ ఛార్జీ జీరోగా చూపిస్తారు.దీనివల్ల ప్రభుత్వం నుంచి తాము ఎంత లబ్ధిపొందాం అనేది మహిళలు తెలుసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. స్త్రీ శక్తి పథకం అమలులో గందరగోళానికి తావులేకుండా టిక్కెట్లు జారీ చేసే మెషీన్‌ (టిమ్స్‌)లో ప్రత్యేకంగా ఉమెన్‌ ఫ్రీ టిక్కెట్‌ (డబ్ల్యుఎఫ్‌టీ) పేరిట ప్రత్యేకంగా ఒక బటన్‌ ఏర్పాటు చేశారు. బాలికలు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్లకు జీరో ఫేర్‌ టిక్కెట్‌ ఇవ్వడానికి ఈ ఒక్క బటన్‌ ప్రెస్‌ చేస్తే చాలు ప్రింటెడ్‌ టిక్కెట్‌ వస్తుంది. పురుషులకు గతంలో మాదిరిగానే ప్రయాణ దూరానికి అనుగుణంగా ఛార్జీలను నిర్దేశించి టిక్కెట్లు ఇస్తారు.

స్త్రీ శక్తి అమలుకు సిద్ధంగా ఉన్నాం..

స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.జిల్లాలో స్త్రీ శక్తి పథకం అమలుకు సిద్ధంగా ఉన్నాం. టిక్కెట్‌ తీసుకునే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి తగిన గుర్తింపుకార్డు చూపించి జీరో టిక్కెట్‌ పొందాలి. టిక్కెట్ల జారీకి సంబంధించి ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాం.

వైఎస్‌ఎన్‌ మూర్తి, జిల్లా ప్రజారవాణా అధికారి

Updated Date - Aug 15 , 2025 | 12:37 AM