రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం స్పందించాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:36 AM
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు పేర్కొన్నారు.
అమలాపురం టౌన్, మే 30(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు పేర్కొన్నారు. శనివారం ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులపై స్పందించాలని ఆయన సూచించారు. కన్వీనర్ రామ్మోహనరావు అధ్యక్షతన శుక్రవారం అమలాపురంలో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రైల్వేలైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కోటిపల్లి గౌతమీ నది వద్ద రైల్వే బ్రిడ్జిపై గడ్డర్స్ వేయడానికి రెండేళ్ల క్రితం టెండర్లు ఖరారు అయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. సమావేశంలో కల్వకొలను బాబు, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, సీలి సంసోను, మాచిరాజు నాగేశ్వరరావు, జంగా రాజేంద్ర, బాలనాగు, సురాజ్, ఈతకోట సూర్య, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.