Share News

పామాయిల్‌ వెల..విల!

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:25 AM

జిల్లా లో ఆయిల్‌పామ్‌ రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు.

పామాయిల్‌ వెల..విల!

పామాయిల్‌ రైతుల ఆందోళన

తగ్గిన దిగుమతి సుంకం

కానరాని కనీస మద్దతు ధర

ఆదుకోవాలని వేడుకోలు

ఆత్రేయపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): జిల్లా లో ఆయిల్‌పామ్‌ రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. వరిలో అంతరపంటగా వేసుకుని ప్రభుత్వ రా యితీలు పొందిన కొందరు రైతులు పామాయి ల్‌ సాగు చేపడుతున్నారు. గతేడాది దిగుబడి తో పాటు మద్దతు ధర లభించడంతో జిల్లాలో రైతులు ఈ సాగు చేపడుతున్నారు. ఆ దిశగా ఉద్యానశాఖ ఈ సాగు చేపట్టాలంటూ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మన రాష్ట్రంలో 1,96,801 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపడుతున్నారు. 39.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 76,014 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేపడుతున్నారు. ప్రస్తుత కోనసీమ జిల్లాలో 1110 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ప్రస్తుత తరుణంలో ఆయిల్‌పామ్‌ గెల ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతంనుంచి 16.5శాతానికి తగ్గించడంతో ఈ దుస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న చర్యలతో ఆయిల్‌పామ్‌ రైతులు తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. గతేడాది టన్ను పామాయిల్‌గెల ధర రూ.20 వేల నుంచి రూ.21 వేల వరకు పలికింది. దిగుమతి సుం కాన్ని తగ్గించడంతో టన్ను రూ.18,650కు పడిపోయింది. ఇది మరింత తగ్గవచ్చని రైతులు కలవరపడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు వేడుకుంటున్నారు.

టన్ను రూ.18,650 ఉంది..

ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ టన్ను ధర రూ.18,650 ఉంది. కోనసీమలో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం ధర తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ధర ఒకేలా ఉండదు.. ఏ పం టకైనా తగ్గడం పెరగడం సర్వసాధారణం.. అయితే ఒకేసారి రూ.2 వేలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

-జి.కోటేశ్వరరావు, ఉద్యానశాఖాధికారి

కేంద్రం మద్దతు ధర ప్రకటించాలి

కేంద్రం పామాయిల్‌పై ది గుమతి సుంకం తగ్గించింది. రెండు నెలలనుంచి ధరలేకపోవడంతో అప్పుల పాలయ్యాం. టన్ను రూ.21 వేల నుంచి రూ.18,650కి పడిపోయింది. వ్యయప్రయాసలతో సాగు చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర రూ.21 వేలు ఉండేలా చర్యలు చేపట్టాలి.

-కరుటూరి వరప్రసాద్‌, రైతు, అంకంపాలెం

Updated Date - Jul 10 , 2025 | 01:25 AM