నాడు-నేడు పనుల్లో అవకతవకలపై అధికారుల విచారణ
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:18 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద మంజూరు చేసిన పనుల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలపై అమలాపురం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అప్పట్లో పనిచేసిన ప్రధానోపాధ్యాయిని ఎస్.రాజరాజేశ్వరిపై రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లాస్థాయి అధికారుల బృందం గురువారం విచారణ చేపట్టింది.
అమలాపురం టౌన్, జూన్26(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద మంజూరు చేసిన పనుల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలపై అమలాపురం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అప్పట్లో పనిచేసిన ప్రధానోపాధ్యాయిని ఎస్.రాజరాజేశ్వరిపై రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లాస్థాయి అధికారుల బృందం గురువారం విచారణ చేపట్టింది. నాడు-నేడు పనుల్లో జరిగిన అవకతవకలపై పాఠశాల పూర్వ విద్యార్థులు, అప్పటి స్కూలు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో పాటు పలువురు వేర్వేరుగా సమగ్రశిక్ష కేంద్ర కార్యాలయం (అమరావతి)కు, విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. రాజరాజేశ్వరి హెచ్ఎంగా పనిచేసిన సమయంలో ఉపాధ్యాయుల పట్ల వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై అమరావతి కేంద్ర కార్యాలయం జిల్లాస్థాయిలో విచారణ అధికారుల బృందాన్ని నియమించింది. సమగ్రశిక్ష జిల్లా అక్కౌంట్స్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్, అమలాపురం ఉపవిద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాశం తదితరుల ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో రాజరాజేశ్వరి కాట్రేనికోన మండలం పి.లక్ష్మీవాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆమె సమక్షంలోనే ఫిర్యాదుదారులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో విచారణ నిర్వహించారు. విచారణకు హాజరైన వారందరికీ ఒక ప్రశ్నావళిని అందించి అది పూర్తిచేసి ఇమ్మన్నారు. నాడు-నేడు పనుల్లో ఎంతమేర అవినీతి జరిగింది, విచారణ అంశాలను వెల్లడించేందుకు అధికారులు అంగీకరించలేదు. విచారణ సమగ్ర నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషాకు అందిస్తామని చెప్పారు. విచారణ అంశాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.