ద్రాక్షారామలో రూ .11.5 కోట్లతో ఇండస్ట్రియల్ పార్కు
ABN , Publish Date - May 06 , 2025 | 01:57 AM
ద్రాక్షారామలో రూ.11.5 కోట్లతో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పా ర్కు ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి సుభాష్ తెలిపారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), మే 5 (ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామలో రూ.11.5 కోట్లతో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పా ర్కు ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి సుభాష్ తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పా టుకు ఊతమిస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ద్రాక్షారామ సమీపంలో ఆదివారపుపేట గురుకుల పాఠశాల వద్ద ఈ పార్కు నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇండ స్ట్రియల్ పార్కులను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందని, ఇందులో భాగంగా 2027-28 నాటికి 15వేల ఎంఎస్ఎంఈలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీటి ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు లభిస్తాయన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండస్ట్రియల్ పార్కులకు రూపకల్పన చేసిందన్నారు. మేడే సందర్భంగా సీఎం చంద్రబాబు పది నియోజకవర్గాల్లో 30 ఎంఎస్ ఎంఈలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పాటుచేసే పారిశ్రామిక పార్కులో ఉపాధి కల్పనలో భాగంగా నియోజకవర్గంలో భర్తను కోల్పోయిన 40 ఏళ్లలోపు మహిళలు 160 మందిని గుర్తించామని, వారికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలు స్థాపించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమ పెట్టాలనుకునేవారు ముందుకువస్తే బ్యాంకు రుణాలు మం జూరు చేసేలా వారికి సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఎంఎస్ఎంఈల పార్కుల నిర్మాణంతో వేలాది మంది ఉపాధి పొందుతారని చెప్పారు.